తెలంగాణకు అడ్డుపడినవారికే పెద్దపీట,సీమాంద్రుల పెత్తనం ఇంకానా?
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోట్లాడినోడు ఎక్కడ్నో పోయిండు, మనకు అడ్డం పడ్డోడోమో ముందుకు వచ్చిండు అనే ఆవేదన ప్రజల్లో పెరుగుతోందన్నారు.
హైదరాబాద్ :''తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినోడు ఎక్కడికో పోయాడు...రాష్ట్ర సాధనకు అడ్డంపడినవాడు ముందుకువచ్చాడ''ని తెలంగాణ జెఎసి చైర్మెన్ కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అడుగుగడుగునా అడ్డుపడిన వారే తెలంగాణ రాష్ట్రంలో ముందు వరుసలో ఉన్నారని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.
హైద్రాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన తెలంగాణ విద్యావంతుల వేదిక డైరీని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరును ఆయన దుయ్యబట్టారు.
తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినవారికి అనుకూలంగా ప్రభుత్వం పనిచేస్తోందని కోదండరామ్ ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిని మార్చుకోవాలని కోదండరామ్ సూచించారు.
ఉద్యమంలో వ్యతిరేకంగా పనిచేసినోళ్ళకే పెద్దపీట
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడినోడు ఎక్కడ్నో పోయిండు..మతనకు అడ్డం పడ్డోడేమో ముందుకు వచ్చిండు అని తెలంగాణ జెఎసి చైర్మెన్ కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో ముందుకు సాగుతున్నవారిని కట్టె పట్టుకొని కొట్టినోడు కుర్చీలో కూర్చున్నాడని చెప్పారు. ఇలాంటి వారితో ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని తీసుకెళ్తోందా అని ఆయన ప్రశ్నించారు.
ప్రజలను చైతన్య పర్చాలి
తెలంగాణ ఉద్యమ వారసులమని ప్రకటించుకొని ధైర్యంగా ముందుకు సాగడమే తమ ముందున్న బాధ్యత అని ఆయన చెప్పారు. ఈ మేరకు ప్రజలను చైతన్య పర్చాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.తెలంగాణ ప్రభుత్వంపై సీమాంద్రుల పెత్తనం ఇంకా సాగుతోందని ఆయన విమర్శలు గుప్పించారు.
అభివృద్ది ఆకాంక్షలకు అనుగుణంగా నమూనా రూపొందించుకోవాలి
ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా నూతన అభివృద్ది నమూనాను రూపొందించుకోవాలని హితవు పలికారు టిజెఎసి చెర్మైన్.ఎస్ సి ఎస్ టి బిసి కార్పోరేషన్ల ద్వారా యువతకు ప్రోత్సహకాలు రుణాలు అందజేసి సహయం చేయవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.విద్య, వైద్యం, ఉద్యోగాలు అందరికీ లభించాలని కోరుతున్నట్టు చెప్పారు కోదండరామ్.
ఎన్ని ఉద్యోగాలిచ్చారు.
తొలుత 1.07 లక్షల ఉద్యోగాలని చెప్పారు. లెక్కలు తీస్తే 58 వేల ఉద్యోగాలు దొరికాయని, ఇప్పటికి పదివేలని, మళ్ళీ 4 వేలని తేల్చారని చెప్పారు . చివరికి కేవలం 1600 ఉద్యోగాలే అంటున్నారని చెప్పారు. అయితే ఏది నిజమో తెలియని గందరగోళ పరిస్థితులున్నాయని కోదండరామ్ చెప్పారు.
'వలసాధిపత్యం ఇంకా కొనసాగుతోంది'
తెలంగాణ ప్రభుత్వంపై సీమాంద్రుల పత్తనం సాగుతోందన్నారు.అంతేకాదు వలసాధిపత్య పాలకుల విధానాలనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. ఈ పద్దతిని మానుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.