టీజేఏసీ ఛైర్మన్ పదవికి కోదండరాం రాజీనామా: ఇక టీజేఎస్లోనే
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ(జాయింట్ యాక్షన్ కమిటీ) ఛైర్మన్ పదవికి ప్రొఫెసర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. గన్పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించి రాజీనామా పత్రాన్ని జేఏసీ కన్వీనర్ రఘుకు అందజేశారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ జనసమితిలో చేరుతున్నందున జేఏసీ అధ్యక్ష పదవిని శనివారం నుంచి వదిలేస్తున్నట్టు చెప్పారు. అప్పటి స్టీరింగ్ కమిటీ నిర్ణయం మేరకు జేఏసీ అధ్యక్ష పదవి స్వీకరించానని తెలిపారు. జేఏసీలో లేకున్నా తమ సహకారం ఉంటుందని తెలిపారు.
2009 నుంచి సహకరించిన వారందరికీ కోదండరాంకృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జనసమితిలోనూ ఇంతకు ముందు పాత్రే పోషిస్తానని స్పష్టం చేశారు. ఇక నుంచి జేఏసీ బాధ్యతలను ప్రస్తుత కన్వీనర్ రఘు నిర్వహిస్తారని చెప్పారు. జేఏసీ అధ్యక్షుడ్ని స్టీరింగ్ కమిటీ ఎన్నుకుంటుందని కోదండరాం తెలిపారు.