వద్దనుకున్నాం, పోయింది: సీమాంధ్ర పెత్తనంపై కోదండ, 'వచ్చింది రాజకీయ తెలంగాణే'
హైదరాబాద్: తెలంగాణ నుంచి సీమాంధ్రుల పెత్తనం పోవాలనుకున్నామని, ఇప్పుడు పోయిందని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం నాడు చెప్పారు. రాష్ట్రంలో సామాజిక మార్పులు జరగాల్సి ఉందని, అన్నీ ఒకేసారి జరగవని చెప్పారు.
కోదండరాం రాసిన తెలంగాణ రాష్ట్రోద్యమం పుస్తకాన్ని బుధవారం ఆచార్య రమా మెల్కొటే సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వ్యవసాయ రంగం దెబ్బతిందన్నారు. సామాజిక మార్పులు జరగాల్సి ఉందని, అన్నీ ఒకేసారి జరగవన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రూపొందించుకోవాలని సూచించారు. ప్రజలు కేంద్రంగా చేతివృత్తులు, చిన్న తరహా పరిశ్రమలు ఆధునికీకరించడం, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకోవడం, బతుకుదెరువు కోసం ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానాన్ని రూపొందించుకోవాలన్నారు.
ప్రజలకు చేదోడువాదోడుగా ఉండే ఒక పౌరవేదికగా నిలబడి పని చేయాలన్నదే తమ ఆలోచన అని ఈ సందర్భంగా కోదండరామ్ చెప్పారు. పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో జరిగిన పలు కీలక మలుపులు, ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తూ భవిష్యత్తు రాష్ట్రాన్ని వీక్షిస్తూ కోదండరామ్ రాసిన రచనలు ఎంతో విలువైనవని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ... కోదండరామ్ ఉద్యమ సందర్భంలో ఆచరణాత్మకంగా ఏవిధంగా పని చేశారో అదే నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రోద్యమం పుస్తకాన్ని రాశారన్నారు. ఆయన రచనలు తెలంగాణ సమాజానికి అద్దంలా నిలుస్తాయన్నారు.
రాబోయే ఉద్యమాలకు కోదండరామ్ పునాదులు వేశారన్నారు. రమా మెల్కొటే మాట్లాడుతూ... కోదండకు ఉద్యమం, రచనలు చేయడం రెండు కళ్లు అన్నారు. వచ్చింది రాజకీయ తెలంగాణనే అని, అందరూ కోరుకున్న సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం జరగాలని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు.