కేసీఆర్ గురించి చెప్తే విన్లేదు, ఓటమికి ఈవీఎంలే కారణం కాదు: కాంగ్రెస్కు కోదండరాం గట్టి షాక్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి ఓడిపోవడంపై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం మంగళవారం స్పందించారు. ప్రచారం విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఆలస్యం చేసిందని చెప్పారు. ప్రచారం చేసేందుకు పదిహేను రోజులు చాలునని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, 3 వారాలు చాలు అని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారని చెప్పారు.
తెరాస గెలుపుకు ముగ్గురు కారణం, ఎవరంటే, ఇక బాధ్యత నాదే: కూకట్పల్లిలో కేటీఆర్
కేసీఆర్ ప్రచారం శైలి గురించి నేను చెప్తే విన్లేదు
అదే సమయంలో కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రచారం విషయంలో తాను చెప్పినా వినలేదని వాపోయారు. తెరాస అధినేత కే చంద్రశేఖర రావు ప్రచార శైలి గురించి తనకు తెలుసునని, ఆయన ప్రచార శైలి మీకు తెలియదని వారికి చెప్పానని కానీ వినిపించుకోలేదని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో అధికారుల తప్పిదాలు కూడా ఓటమికి మరో కారణమని చెప్పారు.
ఓటమికి ఈవీఎంలే కారణమని చెప్పడం సరికాదు
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని తమ మహా కూటమి ఓటమికి ఈవీఎంలే కారణమని చెప్పడం సరికాదని కోదండరాం చెప్పారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చేలా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఈవీఎం అవకతవకలే కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఫిర్యాదులు కూడా చేశారు. ఇలాంటి సమయంలో కోదండరాం మరోలా స్పందించడం గమనార్హం.
చంద్రబాబు-కేసీఆర్ ఏం రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకుంటారో చూడాలి
అలాగే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడం, తెరాస గెలిచిన తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ.. తాను ఏపీకి వెళ్తానని, రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. దీని పైన కూడా కోదండరాం స్పందించారు. కేసీఆర్ చంద్రబాబుల మధ్య ఏం సంబంధాలు ఉన్నాయోనని, అలాగే ఏం గిఫ్ట్లు ఇచ్చుకుంటారో చూడాలని వ్యాఖ్యానించారు.
ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదు
త్వరలోనే కూటమి సమావేశమవుతుందని కోదండరాం చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలపై తాము చర్చిస్తామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదని ఆయన చెప్పారు. మూడో కూటమి కట్టడానికి కొన్ని ప్రాతిపదికలు ఉండాలని అన్నారు.