విమర్శలు చేస్తాం, పనీ చేస్తాం: కోదండరామ్ మాట
హైదరాబాద్: ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఆగకుండా తెలంగాణ కోసం నిర్మాణాత్మకంగా పని చేస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వాఖ్యానించారు. హైదరాబాదు నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు
వర్శిటీల్లో సంక్షోభం అంశంపై ఉస్మానియా యూనివర్శిటీ దూరవిద్య కేంద్రంలో ఈ నెల 28న, విద్యావ్యవస్థ - సమస్యలు అంశంపై పబ్లిక్ గార్డెన్స్లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 29న సదస్సులు నిర్వహించనున్నట్లు కోదండరామ్ చెప్పారు. కార్యక్రమంలో 'అభివృద్ధి-ప్రజాస్వామిక ఆకాంక్షలు-రాజ్యం' అంశంపై యూజీసీ మాజీ చైర్మన్, ఆర్థికవేత్త సుఖ్దేవ్ థొరాట్ ప్రొ. జయశంకర్ ఐదో స్మారకోపన్యాసం చేశారు.
తాను యూజీసీ చైర్మన్గా ఉన్నపుడు జయశంకర్తో పరిచయం ఏర్పడిందని, తర్వాత రెండుసార్లు కలిసినపుడు తెలంగాణ సాధన పోరాటంలో ఆయన పోషిస్తున్న కీలకపాత్ర గురించి తెలిసిందని సుఖ్దేవ్ చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు చేసిన పోరాటం వల్ల రాష్ట్రం సాధించుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలంతా ఒకే జాతికి చెందిన వాళ్లమనే భావనతో మెలిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
ఒకే కులం, పార్టీ గనక పాలిస్తూ పోతే ప్రజల ఆకాంక్ష దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రజలకు పాలనలో భాగస్వామ్యం లభించినపుడే పోరాడి సాధించుకున్న రాష్ట్రానికి అర్థం ఉంటుదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల పునర్విభజన కమిషన (ఎస్సార్సీ)లో భాష ప్రాతిపదికగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న విధానాన్ని అంబేద్కర్ వ్యతిరేకించారన్నారు.
ఓబీసీలకు 21శాతం, ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 7శాతం మాత్రమే చదువుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు. విద్యా అసమానతల వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు.