రికార్డు చేయాలి: ఉద్యమ డైరీ ఆవిష్కరణలో కోదండరామ్
హైదరాబాద్: ఉద్యమం సందర్భంగా చోటు చేసుకుని అనేక సంఘటనలను రికార్డు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఉద్యమ డైరీ పుస్తకం ఉద్యమ చరిత్రను తెలుసుకోవడానికి పనికి వస్తుందని చెప్పారు.
పిట్టల రవిందర్ రచించిన ‘తెలంగాణ ఉద్యమ డైరీ' పుస్తకావిష్కరణ జరిగింది. శనివారం హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.
చరిత్రను సృష్టించిందే తెలంగాణ వాళ్లు అని అన్నారు. మన చరిత్రను మనమే రాసుకునే అవకాశం వచ్చిందని ఘంటా చక్రపాణి అన్నారు. తెలంగాణ ఉద్యమానికున్న ప్రామాణికత ఉద్యమ డైరీలో తెలుస్తుందన్నారు. ఉద్యమంలో ఉద్యోగులు నిర్వహించిన పాత్రను రవీందర్ వివరించారని చెప్పారు.
తెలంగాణ చరిత్రకు ప్రామాణికత ఎక్కడా అని అడుగుతున్నారని, కానీ చరిత్రకు ప్రామాణికత అవసరంలేదని వివరించారు. ఉద్యమంలో పాల్గొన్న వారే ఇవాళ తెలంగాణ చరిత్రను రాస్తున్నారని వివరించారు.