దీపావళి వరకు తేల్చకుంటే: మహాకూటమి సర్దుబాటు-టీఆర్ఎస్పై కోదండ కీలకవ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం సోమవారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశంపై కూడా స్పందించారు. తమకు గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. పొత్తులు ఖరారయ్యాక అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.
చంద్రబాబు గురించి నేను చెప్పను, ఆయన చెప్పిందే: కేటీఆర్ దిమ్మతిరిగే షాక్
పొత్తులపై తాము సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. పొత్తులపై జాప్యం కారణంగా ప్రజా సంఘాల్లో నిరుత్సాహం కనిపిస్తోందని అన్నారు. పార్టీ గుర్తు విడుదల చేశామని, మేనిఫెస్టో ఫైనల్ అయిందని చెప్పారు. ఎన్నికల కమిషన్ అప్రూవల్ రాగానే విడుదల చేస్తామని చెప్పారు.
ఈ రోజు (సోమవారం) కాంగ్రెస్ నేతలను కలుస్తామని చెప్పారు. పది సీట్లలో పోటీ చేస్తామని, తమకు బలం ఉందని వారికి చెప్పామని అన్నారు. దసరాకి కావాల్సిన కూటమి ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం ఏమాత్రం మంచిది కాదని కోదండరాం అన్నారు.
దీపావళి కల్లా సీట్లపై స్పష్టత వస్తే అందరికీ మంచిదని చెప్పారు. పొత్తులపై కొంత వరకు ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కూటమి ఉందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. కూటమి ఏర్పాటు కాకుండా టీఆర్ఎస్ పార్టీ కుట్రలకు పాల్పడుతోందన్నారు.
పొత్తులు ఖరారయ్యాక అభ్యర్థులనుప్రకటన చేస్తామని చెప్పారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఆలస్యం కొంత నష్టం చేసిందని చెప్పారు. రాజకీయ అవసరాల కోసం కూటమి కాదని, ప్రత్యామ్నాయ మార్గమని చెప్పారు. త్వరగా ప్రజలలోకి వెళ్తే ప్రజా ఉప్పెన కదలి వస్తుందన్నారు.
కూటమిని విచ్ఛిన్నం చేయడానికి తెరాస కుట్ర చేస్తోందన్నారు. సీపీఐ సమస్యను కూడా మా సమస్యగా చూస్తామని చెప్పారు. సీపీఐ కూడా కూటమిలా ఉండాలన్నారు. సీపీఐ బయటకు వెళ్లిపోతే కూటమికి చాలా నష్టమని చెప్పారు. నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలనుకునే వాళ్లు తమతో కలిసి రావాలని చెప్పారు. కూటమికి సహకరించాలన్నారు.