భూసేకరణలో దౌర్జన్యాలు : కోదండరాం సంచలన కామెంట్
హైదరాబాద్ : నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి.. ప్రజాభిప్రాయాన్ని, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టాలని గత కొంతకాలంగా ప్రొఫెసర్ కోదండరాం తన గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయమై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సమావేశం సందర్భంగా మాట్లాడిన ఆయన.. భూసేకరణలో దౌర్జన్యాలు జరుగుతున్నాయన్న విషయం దృష్టికి వచ్చిందని సంచలన కామెంట్ చేశారు. ఇకపోతే, ముంపు బాధితుల హక్కులను పరిరక్షించాలని చెప్పిన కోదండరాం, ప్రాజెక్టు నిర్మాణం కోసం నీటి పారుదల నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమావేశానికి హాజరైన మరో ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. పంథాలకు పోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన హరగోపాల్, ప్రజా ప్రయోజనాలను దృష్టి ఉంచుకుని ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు.
రిజర్వాయర్ అనవసరం :
సాగు కాలమంతా నీరు లభ్యమయ్యే అవకాశమున్నప్పుడు రిజర్వాయర్ నిర్మించాల్సిన అవసరం లేదన్నారు నీటి పారుదల రంగ నిపుణుడు హనుమంతరావు. మల్లన్న సాగర్ కట్టి తీరుతామంటున్న ప్రభుత్వం పంథాలకు పోవడం సరికాదని సూచించారు.