కోదండరాం మధ్యలో వెళ్లిపోలేదు: హోటల్లో చర్చలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహాకూటమిలో అసంతృప్తి వెల్లువెత్తుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమకు కేటానుయించిన స్థానాలపై సీపీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. రెండ్రోజుల్లో తేల్చకుంటే తాము సొంతగా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేసింది. మరోవైపు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో కూటమి నేతలు భేటీ అయ్యారు. కోదండరాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా తదితరులు భేటీ అయ్యారు. తెలంగాణ టీడీపీ 14 నుంచి 16 సీట్లు అడుగుతోంది. అందుకు కాంగ్రెస్ దాదాపు సిద్ధంగా ఉంది. దీంతో టీడీపీ, కాంగ్రెస్ మధ్య ఎలాంటి స్పర్థలు లేవు. దీంతో ఎల్ రమణ హాజరు కాలేదు.
తీవ్ర అసంతృప్తితో ఉన్న సీపీఐని ఆహ్వానించలేదని తెలుస్తోంది. అంతకుముందే సీపీఐ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అల్టిమేటం జారీ చేయడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కోదండరాం పార్టీతో నేడు లేదా రేపు సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని చెప్పారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పారు. కూటమి పార్టీలతో మాట్లాడుతున్నామని తెలిపారు. కూటమి సమావేశం ముగిసిన తర్వాతనే కోదండరాం బయటకు వెళ్లారని, తమతో పూర్తిగా చర్చించారని, ఆయన మధ్యలో వెళ్లిపోలేదని చెప్పారు.
ఈ రోజు అర్ధరాత్రి వరకు చర్చలు జరుగుతాయని, విజయవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి నుంచి ఎవరూ తప్పుకోరని చెప్పారు. పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉన్నందున మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక కూటమి అభ్యర్థులను ప్రకటించిందని చెప్పారు.