పరిశ్రమకు తీరని లోటు: కోడి రామకృష్ణ మృతిపై చంద్రబాబు-కేసీఆర్ల సంతాపం
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ ఆయన సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం నాగహారవు తర్వాత మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.
కోడి రామకృష్ణ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. దర్శకుడు కోడి రామకృష్ణ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలుగు సినీరంగంలో తనదైన శైలితో ఎన్నోచిత్రాలను తెరకెక్కించి, 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని, అలాంటి కోడి రామకృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు.
'ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి తీవ్ర విచారకరం. ఎన్నో విజయవంతమైన గ్రామీణ ప్రాంత నేపధ్యంతో కూడిన కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు, తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితో సినిమాలు రూపొందించిన ఘనత సాధించిన ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోట'ని ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.
'ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు కోడి రామకృష్ణ గారి మృతి పరిశ్రమకు, తెలుగు సినీ కళామతల్లికి, తెలుగు ప్రేక్షక లోకానికి తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.' అని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ అన్నారు.
'శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణగారి మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని మరో టీడీపీ రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సంతాపం తెలిపారు.
'ప్రముఖ తెలుగు సినీ దర్శకులు శ్రీ కోడి రామకృష్ణగారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను.' అని ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.