మీడియా ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి: కోల్కతా ప్రమాదంలో కర్నూల్ వాసి మృతి
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో కూలిన ప్లైఓవర్ విషయంపై ఐవీఆర్సీఎల్ ప్రతినిధులు శుక్రవారం నాడు హైదరాబాదులోని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓ సందర్భంలో ప్రతినిధులు మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారు మాట్లాడుతూ... ఎందుకు కూలిందో తమకు తెలియదన్నారు. ఇది దురదృష్టకరమన్నారు. ఎందుకు కూలిందో మేం కూడా తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. ఎందుకు జరిగిందో తెలుసుకోవాలన్నారు. ఈ సంఘటన జరిగిందుకు తాము ఎంతో విచారపడుతున్నామన్నారు.
ఈ ఘటనలో చాలామంది మృతి చెందారని, ఎందరో గాయపడ్డారని దానికి తాము ఎంతో బాధపడుతున్నామని చెప్పారు. తాము విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఫ్లై ఓవర్ నిర్మాణంలో బలంగా ఉన్న 59 పిల్లర్లకు ఏ మెటీరియల్ వాడామో.. 60వ పిల్లర్ వరకు అదే మెటీరియల్ వాడామని చెప్పారు.
పోలీసులు, కంపెనీ ప్రతినిధులను అరెస్టు చేస్తారనే విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నామన్నారు. నిర్మాణంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని చెప్పారు. ఎలాంటి లోపాలు లేవని చెప్పారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామన్నారు.
2009లో తమకు కాంట్రాక్టు ఇచ్చారని, ఇప్పుడు 2016 వచ్చిందని, 70 శాతం పనులు పూర్తి చేసామని, కానీ ఇప్పటి వరకు తనకు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. నాణ్యతలో ఎలాంటి లోపం లేదన్నారు. 59 పిల్లర్లు ఏ మెటీరియల్తో కట్టారో 60వ పిల్లర్ అదే మెటీరియల్తో కట్టామని చెప్పారు.
ఎందుకు కూలిందో తెలుసుకునేందుకు మా టీం కూడా వెళ్లిందని చెప్పారు. కోల్కతా ఘటన కేవలం దురదృష్టకరమే అన్నారు. కోల్కతా ఘటన ప్రమాదమేనని, కానీ కావాలని చేసింది కాదన్నారు. కావాలని ఎవరూ మనుషులను చంపేంత ఉండదన్నారు. ఇంత మూర్ఖులు లేరని అభిప్రాయపడ్డారు.
గాయపడ్డ వారిలో మా వాళ్లు కూడా ఉన్నారని, చెప్పారు. ఏడుగురు గాయపడి ఆసుపత్రిలో ఉన్నారని చెప్పారు. ప్రమాదం పైన మీడియా తప్పుడు ప్రచారం సరికాదన్నారు. ఎలా కూలిందో విచారణ తర్వాత తేలుతుందని, ఇప్పుడే నిర్ధారణకు రాలేమని చెప్పారు.
ఘటన పైన అందరిలాగే మేం కూడా షాక్కు గురయ్యామని చెప్పారు. విలేకరులు పదేపదే ప్రశ్నించడంతో.. కంపెనీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరగకుండా ఎలా జరిగిందో ఎలా చెప్పగలమని ఘాటుగా ప్రశ్నించారు. ఇక్కడ మనం ఇలాగే చర్చించుకుందామా.. లేక ఫ్లై ఓవర్ కింద ఉన్న మిగతా వాళ్లను కాపాడుకుందామా చెప్పాలని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రశ్నలకు ఐవీఆర్సీఎల్ యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి అయింది.
కోల్కతా ఫ్లై ఓవర్ ఘటనలో కర్నూలు వాసి మృతి
కోల్కతా ఫ్లై ఓవర్ ఘటనలో కర్నూలు వాసి ఒకరు మృతి చెందాడు. విశ్రాంతి కోసం ఫ్లై ఓవర్ కింద ఆగిన సమయంలో అతను మృతి చెందాడు. మృతి చెందిన కర్నూలు వాసి పేరు అబ్దుల్ రషీద్. అతను లారీ క్లీనర్గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.