కూలిన కోల్కతా బ్రిడ్జి: ముగ్గురి అరెస్టు, హైదరాబాద్లో దర్యాప్తు (పిక్చర్స్)
హైదరాబాద్: పశ్చిమ్ బంగ రాజధాని కోల్కతాలో గురువారం కుప్పకూలిన రహదారి ఫ్లైఓవర్ శిథిలాల నుంచి మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరుకుంది. కాగా, ఫ్లైఓవర్ను నిర్మిస్తున్న హైదరాబాద్లోని ఐవీఆర్సీఎల్ కంపెనీకి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. వీరిపై హత్యా అభియోగాలు మోపినట్లు సమాచారం.
అంతకుముందు పోలీసులు ఐవీఆర్సీఎల్కు చెందిన 10 మంది అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు కోల్కతా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అరెస్టయిన వారిలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మల్లికార్జున్, అసిస్టెంట్ మేనేజర్ దేబ్జ్యోతి మజుందార్, నిర్మాణ ఆకృతులను పర్యవేక్షించే ప్రదీప్కుమార్ సాహా ఉన్నారు.
వీరిపై ఐపీసీ 302 (హత్య), 307 (హత్యా ప్రయత్నం), 120బి (నేరపూరిత కుట్ర), ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిని శనివారం కోర్టులో హాజరు పరచనున్నారు. మరో ఏడుగురు అధికారులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణంలో పాలు పంచుకున్న కోల్కతా మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాధికారసంస్థకు చెందిన ఇద్దరు ఇంజినీర్లను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే పైవంతెన మిగతా భాగం స్థితిని తెలుసుకోవటానికి తక్షణం పూర్తిగా తనిఖీ చేయాలనీ ఆదేశించింది.
ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకొని నిర్మాణానికి ఉపయోగించిన పదార్థాల నమూనాలను సేకరించారు. ఐవీఆర్సీఎల్పై పోలీసులు గురువారం ఐపీసీ 304, 308, 407 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, స్థానిక కార్యాలయాన్ని మూసేశారు. దుర్ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. కోల్కతాలో బుర్రాబజార్ ప్రాంతంలో గురువారం నిర్మాణంలో ఉన్న రహదారి ఫ్లై ఓవర్ లోని 60 మీటర్ల పొడవైన భాగం కుప్పకూలిన సంగతి తెలిసిందే.
హైదరాబాదులో దర్యాప్తు
ఫ్లైఓవర్ దుర్ఘటనపై దర్యాప్తునకు కోల్కతా నేర విభాగం పోలీసులు శుక్రవారం హైదరాబాద్కు వచ్చారు. ఐవీఆర్సీఎల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో అధికారులను, సిబ్బందిని 4 గంటల పాటు ప్రశ్నించారు. సీఐ చక్రవర్తి నేతృత్వంలోని నలుగురు అధికారుల బృందం ముందుగా హైదరాబాద్ కమిషనర్ మహేందర్రెడ్డిని కలుసుకొని దర్యాప్తులో సహకరించాలని అభ్యర్థించింది.
ఫైళ్ల పరిశీలన...
మధ్యాహ్నం 3 గంటలకు ఐవీఆర్సీఎల్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న కోల్కతా పోలీసులు ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఛైర్మన్ సహా ఉన్నతాధికారులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఛైర్మన్, ప్రమోటర్లు ఎవరూ లేరని చెప్పడంతో 41(ఎ) సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం అక్కడున్న కంపెనీ అధికారులకు ఛైర్మన్ సుధీర్రెడ్డికి, అలాగే అశోక్రెడ్డి, బలరామిరెడ్డి, జీవీకే మూర్తితో పాటు స్వతంత్ర సంచాలకులు, క్రియాశీలకంగా లేని భాగస్వాములకూ నోటీసులు అందజేశారు. 4 రోజుల్లో విచారణకు హాజరుకావాలని వీరిని ఆదేశించారు.
విధిలిఖితమా...
ఫ్లై ఓవర్ కుప్పకూలటాన్ని విధి లిఖితంగా వర్ణించి విమర్శలకు గురైన ఐవీఆర్సీఎల్ కంపెనీ ఇదొక ప్రమాదంగా వియీెకియీవ. వంతెన నిర్మాణంలో నాణ్యతపరంగా ఎలాంటి సమస్యలు లేవని తెలిపింది.
అదే సామాగ్రి వాడారు...
వంతెనలోని 59 భాగాలకు వాడిన సామగ్రినే 60వ సెక్షన్కు ఉపయోగించారని, దురదృష్టవశాత్తు ఇది కుప్పకూలింది'' అని కంపెనీ న్యాయ బృందం నేత పి.సీత తెలిపారు. దుర్ఘటన ఎలా జరిగిందో తమకు తెలియదని, కారణాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నామన్నారు.
దర్యాప్తునకు సహకరిస్తాం..
దర్యాప్తు సంస్థలతో సహకరిస్తామని.. దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులందరికీ సూచించామన్నారు. దుర్ఘటనను నియంత్రించటం ఎవరి చేతిలోనూ లేదనే భావనతోనే తమ కంపెనీ అధికారి పాండురంగారావు దీన్ని విధి లిఖితంగా వ్యాఖ్యానించారని చెప్పారు..