రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి : పీసీసీ పీఠం కోసం ఫైనల్ ఫైట్ : వర్కింగ్ ప్రెసిడెంట్గా కొండా సురేఖ..!!
టీపీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారం చివరి దశకు చేరుకుంది. కొంత కాలంగా సీరియల్ లా సాగిపోతున్న ఈ అంశం పైన తేల్చేయటానికి ఏఐసీసీ సిద్దమైంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారం లో ఉన్నా..తాజాగా కోమటిరెడ్డి సైతం చివరి లిస్టులో చేరారు. ఈ ఇద్దరిలో ఒకరికి పీసీసీ పీఠం దక్కనుంది. ఇదే సమయంలో పీసీసీ కమిటీని అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ తుది రూపు ఇస్తున్నట్లుగా సమాచారం. అటు కోమటిరెడ్డి...ఇటు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేసారు. చివరి ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు.
రేవంత్ లేదా కోమటిరెడ్డి కి పీఠం
పీసీసీ అధ్యక్ష పదవితో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్య క్షులు, ప్రధాన కార్యదర్శులతో సహా పలు కమిటీ లను ఏర్పాటు చేయటానికి కసరత్తు పూర్తయింది. ఏ క్షణమైనా ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి ఖాయం అనుకుంటున్న వేళ..అనూహ్యంగా కోమటిరెడ్డి పావులు కదిపారు. దీంతో.. రాష్ట్ర ఇన్ ఛార్జ్ సైతం దీని పైన ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. అంతిమంగా పార్టీ అధినేత్రికి నిర్ణయం వదిలేస్తూ చీఫ్ పదవికి ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు ఇక, అధ్యక్షుడితో పాటు ఆరుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా అధిష్టానం నియమించనుంది.
సామాజిక వర్గాలు...సీనియర్లు
అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, ఇతర సామాజిక వర్గాలకు అవకాశం దక్కేలా ఆరుగురిని ఎంపిక చేయనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ల జాబితాలో దామోదర రాజ నర్సింహ, బలరాం నాయక్, కొండా సురేఖ, షబ్బీర్ అలీ, మధుయాష్కీ లేదా మహేశ్కుమార్ గౌడ్, జగ్గారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి తోడు మరో 30 మందికి పైగా నేతలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించనున్నారు. కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి మాజీ మంత్రి కొండా సురేఖ పేరును ఖరారు చేయనున్నట్లు విశ్వస నీయ సమాచారం.
Recommended Video
పలు కమిటీలు..జంబో టీం సిద్దం
ఎమ్మెల్యే జగ్గారెడ్డికీ ప్రాధాన్యత గల పదవి ఇచ్చేందుకు నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. టీపీసీసీ కార్యవర్గంతోపాటు సలహా కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ, ప్రచార కమిటీ, స్ట్రాటజీ.. ప్లానింగ్ కమిటీ, ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీలనూ నియమించనున్నారు. ఈ కమిటీల్లో ఏదో ఒక దానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కు చైర్మన్గా అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. సీనియర్లందరికీ తగిన ప్రాతినిధ్యం ఉండేలా జాబితాలు సిద్దమయ్యాయి.