'హరీశ్తో భేటీ కారెక్కేందుకేనా..!' : కాంగ్రెస్ను ఉతికారేసిన కోమటిరెడ్డి
నల్గొండ : తెలంగాణలో కాంగ్రెస్ కి అంతో ఇంతో పట్టుందనుకున్న నల్గొండ జిల్లా రాజకీయాలు కూడా పార్టీకి ప్రతికూలంగా రివర్స్ గేర్ లో పయనిస్తున్నట్టుగా అనిపిస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి నేతలంతా వరుస పెట్టి టీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో భేటీ అవడం చూస్తోంటే, కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి కారెక్కి యోచనలో భాగంగానే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా.. అన్న సందేహాలు తలెత్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా మంత్రి హరీశ్ రావును కలవడం పార్టీ మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేదిగా మారింది. ఇక భేటీ విషయానికి వస్తే, మంత్రి హరీశ్ రావును శనివారం ఉదయం ఆయన నివాసంలో కలుసుకున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
అయితే పార్టీ మార్పు ఊహాగానాలకు తెరదించుతూ, భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. హరీశ్ తో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రిని కలిసినట్టుగా వెల్లడించారు. నల్గొండ ప్రాజెక్టులకు సంబంధించి మంత్రి హరీశ్ రావు సానుకూల స్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక పార్టీ మార్పు గురించి మీడియా ప్రతినిథులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ప్రశ్నించగా.. బదులుగా మీడియా ప్రతినిథులకే ప్రశ్న వేశారు. 'టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా నేనెప్పుడైనా చెప్పానా..?' అంటూ ఎదురు ప్రశ్నించారాయన.
ఇక తెలంగాణ కాంగ్రెస్ గురించి ప్రస్తావించిన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల గురించి స్పందిస్తూ.. ఇప్పటికైనా పార్టీకి తక్షణ సర్జరీ చేయాలని, లేకుంటే పోస్ట్ మార్టమ్ చేయడానికి పూనుకోవాల్సి వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శించారు.
పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ టార్గెట్ చేస్తూ.. ప్రస్తుత పీసీసీ ఛీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుపటి పీసీసీ ఛీఫ్ పొన్నాల లక్ష్మయ్యను మించిన అసమర్థుడని సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పార్టీ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహించి ఉత్తమ్ కుమార్ తక్షణం రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
పార్టీ నాయకుల అలసత్వం వల్ల, సీరియస్ నెస్ లేకపోవడం వల్లే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైందన్నారు. తానే గనుక పీసీసీ ఛీఫ్ గా ఉండి ఉంటే, పార్టీని గెలిపించడమో, లేక ఓటమి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడమో చేసుండేవాన్ని అన్నారు.
వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనే దానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై సోనియా గాంధీకి లేఖ రాస్తానని చెప్పారు.
గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రానా..! పార్టీ బలోపేతం కాదని చెప్పిన ఆయన, భువనగిరి ఎంపీగా సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమికా కారణం పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ గ్రూప్ రాజకీయాలేనని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన నేతల చేతుల్లోకే పార్టీ పగ్గాలు వెళ్లాలని సూచించిన ఆయన, పార్టీలో ఇప్పటికీ 15,20 మంది సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల నాటికి తామే సీఎం అభ్యర్థి అనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు.