మైక్ సెట్ విసరలేదు.., మోడీని అన్నావుగా.. నీ అయ్య సొమ్మా?: కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం తీవ్ర పరిణమాలు చోటు చేసుకున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ ఇదంతా ప్రీ-ప్లాన్డ్ వ్యవహారమని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ సభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు.
కేసీఆరే కారణం
తెలంగాణ అసెంబ్లీలో జరిగిన తీవ్ర పరిణామాలకు సీఎం కేసీఆరే కారణమని కోమటిరెడ్డి ఆరోపించారు. బయట నియంత లాగా వ్యవహరించే సీఎం అసెంబ్లీలోనూ అలానే వ్యవహరించారని మండిపడ్డారు. దాడి చేసే అలవాటు కేసీఆర్ గారి ఎమ్మెల్యేలకే తప్ప మాకు లేదన్నారు.
కాలు ఫ్రాక్చర్.. మైక్ సెట్ విసరలేదు
ఘర్షణలో తమకూ గాయలయ్యాయని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఎవరి మీదకు ఏమి విసరలేదని, ఎవరి పైనా దాడి చేయలని చెప్పారు. 'నా కాలు ఫ్రాక్చర్ అయింది.. దానికి సీఎం కారణం కాదా?' అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
పోడియం వద్దకు మమ్మల్ని వెళ్లనివ్వకుండా మార్షల్స్ ను ఎందుకు పెట్టారని నిలదీశారు. మొదటి తప్పు వాళ్లదేనని అన్నారు. మైక్ సెట్ విసరలేదని, కేవలం కొన్ని పేపర్లు చింపి విసిరేశామని అన్నారు.
నీ అయ్య సొమ్ము ఏమైనా పోయిందా?
రైతు సమస్యలపై కూడా ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని, 20లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే అందులో రెండు లక్షల కోట్లయినా రైతులకు కేటాయించలేవా?.. నీ అయ్య సొమ్ము ఏమైనా పోయిందా? అని ప్రధాని మోడీని కేసీఆర్ విమర్శించారని గుర్తుచేశారు.
తాము అదే అంటున్నామని, తెలంగాణ బడ్జెట్ ఐదు లక్షల కోట్లు పెట్టారు కదా, వరి, మొక్కజొన్న, పసుపుకు మద్దతు ధర పెంచితే నీ అయ్య సొమ్ము ఏమన్నా పోతుందా కేసీఆర్? అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
రాసిపెట్టుకోండి ఆరు సీట్లే..
తమపై వేటు వేయడం కాదని, మరో ఆరేడు నెలల్లో ప్రజలు, నిరుద్యోగులు, రైతులు.. కేసీఆర్ని సస్పెండ్ చేయబోతున్నారని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ మోసపు మాటలను ప్రజలు నమ్మడం లేదని, హత్య రాజకీయాలతో, ఓట్ల రాజకీయాలతో కేసీఆర్ గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో 106సీట్లు వస్తాయని కేసీఆర్ చెబుతున్నారని, ఆరు సీట్లు కూడా రావని, ఇది రాసిపెట్టుకోండి అని కోమటిరెడ్డి విమర్శించారు.