ముందు కాంగ్రెస్ పద్దతుల గురించి తెలుసుకో!; దీక్షకు రేవంత్ కు సంబంధం లేదు: కోమటిరెడ్డి,
హైదరాబాద్: కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని తానే నడిపిస్తున్నాను అనే రీతిలో ఆయన మాట్లాడటంపై సీనియర్లు ఫైర్ అవుతున్నారు. శాసనసభా సభ్యత్వం రద్దు తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లకు దీక్ష చేయమని సలహా ఇచ్చింది తానే అని చెప్పడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను ఉపయోగించుకుంటే బంగారం లేదంటే మన్ను అంటూ ఆయన రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి సెటైర్ వేశారు. అలా అయితే టీడీపీలోనే ఉండి ఆ పార్టీనే బంగారం చేసుకోవాల్సిందని అన్నారు.
శాసనసభా సభ్యత్వంపై వేటు పడిన తర్వాత గాంధీ భవన్ లో దీక్ష చేయడానికి రేవంత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఇది సహచర ఎమ్మెల్యే సంపత్కుమార్తో కలిసి తాను తీసుకున్న నిర్ణయమన్నారు. రేవంత్ తన మాటలను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా తాను ప్రజాసమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నానని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని కూడా కాదనుకుని దీక్షకు దిగానని గుర్తుచేశారు.
నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి దీక్షలు చేపట్టానని గుర్తుచేశారు. అలాంటి తనకు దీక్ష చేయాల్సిందిగా నేనే సలహా ఇచ్చానని రేవంత్ చెప్పడం విడ్డూరం అన్నారు.
ముందు కాంగ్రెస్ పద్దతులను తెలుసుకో: పొంగులేటి
కాంగ్రెస్ పార్టీపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. అసలు రాహుల్ గాంధీ రేవంత్ కు ఎలాంటి హామిలు ఇవ్వలేదని అన్నారు. సీఎం కావాలన్న కోరిక వ్యక్తిగతమని, దానిపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని తానే నడిపిస్తున్నట్టు మాట్లాడటం సరికాదన్నారు.
కాంగ్రెస్ వ్యక్తులతో నడవదని, దానికో వ్యవస్థ ఉందన్న సంగతి తెలుసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి ముందు కాంగ్రెస్ పద్ధతులను అర్థం చేసుకోవాలని పొంగులేటి హితవు పలికారు. పదవులు వచ్చినా రాకున్నా పార్టీలో ఎంతోమంది సీనియర్లు క్రమశిక్షణతో పనిచేస్తున్నారని గుర్తుచేశారు.