కాంగ్రెస్ కు టెన్షన్ పుట్టిస్తున్న కోమటి రెడ్డి.. పదవుల కోసమేనా నేతల పంచాయితీ
కాంగ్రెస్ పార్టీలో నేతలు పార్టీలో ఉంటూనే సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటె భవిష్యత్ ఉండదు అని బీజేపీవైపు చూస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్ ఇప్పటికే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన జగ్గా రెడ్డికి కాల్ చేశారు . తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. దీంతో జగ్గా రెడ్డి కూడా పార్టీ మారుతున్నారా అన్న చర్చ మొదలైంది .
కాంగ్రెస్ కు టెన్షన్ పుట్టిస్తున్న కోమటి రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతున్నాయి. మీడియాతో మాట్లాడిన కోమటి రెడ్డి ఈ సారి తెలంగాణలో జరిగిన ఎన్నికలలో టీడీపీతో పొత్తు కాంగ్రెస్ పార్టీ కొంప ముంచిందని పేర్కొన్నారు . అంతేకాదు చంద్రబాబుతో చేతులు కలపవడం వల్ల కాంగ్రెస్ పార్టీని చేజేతులా నాశనం చేసుకున్నామని ఈ ఎన్నికలలో ఓటమికి రాష్ట్ర నాయకత్వమే కారణమని చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీయే సరైన ప్రత్యామ్నాయం అని దేశమంతా బీజేపీ వైపు చూస్తుందని కోమటి రెడ్డి చెప్పటం అటు పార్టీ శ్రేణుల్లోనూ , ఇటు రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారింది.
జగ్గా రెడ్డికి ఫోన్ చేసిన కోమటి రెడ్డి .. కాంగ్రెస్ లో పదవుల కోసమే నేతల అసహనం
ఇక రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఫోన్ చేసిన రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. అయితే పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన కోమటిరెడ్డి నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతుండడంతో ఈ వార్తలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలంగా మారింది . అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి ఆశిస్తున్నారని ఆ పదవి రాకపోవడంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని కొందరు భావిస్తుంటే, మరికొందరు మాత్రం త్వరలో ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని అందుకే ముందస్తు సూచనలు చేస్తున్నారని చెప్తున్నారు . అయితే ఈ విషయంపై పూర్తి స్పష్టత రావాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.
కాంగ్రెస్ లో పదవి ఆశిస్తున్న జగ్గారెడ్డి.. పార్టీ వీడి వెళ్తారా ?
ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ పట్ల అసహనంతో ఉన్నారు. సొంత పార్టీ నేతల పైన పలు ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీ లోని నాయకులకు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని కోవర్టుల పై అధిష్టానం దృష్టి పెట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అంటే తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇక ఈయన కూడా పార్టీ మీద అసహనంతో ఉన్న నేపధ్యంలో కోమటి రెడ్డి తో పాటు జగ్గా రెడ్డి కూడా జంప్ అవుతారా అన్న సందేహాలు లేకపోలేదు. ఏది ఏమైనా కాంగ్రెస్ నాయకులు మాత్రం కాంగ్రెస్ ను వీడి వెళ్ళటం ఖాయం అనే సంకేతాలిస్తూ కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెడుతున్నారు .