త్వరలోనే కారెక్కనున్నారా..! : కేటీఆర్ తో కోమటిరెడ్డి భేటీ వెనుక..
హైదరాబాద్ : నల్గొండ జిల్లా రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా కోమటి బ్రదర్స్ పార్టీ మార్పు అంశంపై చర్చలు జరుగుతున్న సమయంలో, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోనే తన రాజకీయ భవిష్యత్తు కొనసాగుతుందని ప్రకటించగా, అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కారెక్కేందుకే నిశ్చయించున్నట్టుగా తెలుస్తోంది.
తాజా పరిమాణాలను పరిశీలిస్తే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలోనే గులాబీ గూటికి చేరిపోవడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ తో, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అవడం ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అధికారిక పర్యటన నిమిత్తం అక్కడే పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ ని కలుసుకుని పలు అంశాలపై చర్చించినట్టుగా సమాచారం. జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు కార్యకర్తలు కూడా దూరమైపోయాక పార్టీలో రాజకీయ భవిష్యత్తు కష్టమని భావిస్తున్న వెంకట్ రెడ్డి, పార్టీ మార్పుకే మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి స్వయానా బంధువైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ కూడా వెంకట్ రెడ్డి చేరిక పట్ల సానుకూలంగా ఉండడంతో, ఇక వెంకట్ రెడ్డి నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతారో..! లేక కారెక్కి గులాబీ కండువా కప్పుకుంటారో..!