సీఎం వెళ్లి ఫైరింగ్ చేశారా!: షబ్బీర్ అలీ, సభలో నయీం ఇష్యూ రగడ
హైదరాబాద్: శాసన మండలిలో నయీం ఎన్కౌంటర్ విషయమై అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం ఆసక్తికరంగా సాగింది. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండలిలో సైబరాబాద్ కమిషనరేట్ అంశాన్ని, నయీం ఎన్కౌంటర్ అంశాన్ని ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నయీం డైరీలోని పేర్లను అన్నింటిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
దీనిపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కోమటిరెడ్డి కొత్త సభ్యుడు అయితే తెలియక మాట్లాడారని అనుకోచ్చునని, కానీ ఐదేళ్లు ఎంపీగా చేశారని కాబట్టి బిల్లుపై చర్చ సమయంలో ఎలా మాట్లాడుతారన్నారు. తాము అన్ని అంశాల పైన చర్చకు సిద్ధమన్నారు. గ్యాంగ్ స్టర్ నయీం అంశం పైనా చర్చకు సిద్ధమని చెప్పారు.
ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి కల్పించుకొని.. నయీం ఎన్కౌంటర్ విషయంలో తెలంగాణ యావత్తు ఆనందిస్తుందని చెప్పారు.దీనిపై షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వెళ్లి ఫైరింగ్ చేశారా, లేక ఫైరింగ్కు ఆర్డర్ ఇచ్చారా అని ఎద్దేవా చేశారు.
దీనిపై నాయిని మాట్లాడుతూ.. తాను ఈ సంఘటనకు తెలంగాణ ప్రజలు సంతోషిస్తున్నారని చెప్పానని అన్నారు.
కోమటిరెడ్డి సైబరాబాద్ కమిషనరేట్ విభజన పైన కూడా మాట్లాడారు. విభజన శాస్త్రీయంగా లేదన్నారు. నల్గొండ ప్రజలకు దీని వల్ల ఇబ్బంది కలుగుతుందన్నారు. దీనిని మంత్రులు తప్పుబట్టారు. దీనిపై షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి నల్గొండ జిల్లా సభ్యుడు కాబట్టి అక్కడి ప్రజల సమస్యను లేవనెత్తారన్నారు.