నా ఖాతాలో రూ.3లక్షలు వేశారు.. అవసరమా.. : అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలో వెంటనే బెల్టు షాపులను ఎత్తివేయాలని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మద్యపానానికి బానిసలై ఎంతోమంది తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కరోనా కంటే భయంకరమైన వ్యాధి బెల్టు షాపులు అన్నారు. ప్రజలకు నష్టం చేసే పనులు ప్రభుత్వం చేయవద్దన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే తక్షణమే బెల్టు షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇక రైతు బంధు గురించి ప్రస్తావిస్తూ.. అది మంచి కార్యక్రమమే అని చెప్పారు. అయితే రైతు బంధు ప్రయోజనాలు అసలైన పేద రైతులకే దక్కాలన్నారు. అన్నం పెట్టే రైతుకు డబ్బులు ఇవ్వడంలో తప్పు లేదని.. కానీ భూస్వాములు,పెద్ద రైతులకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం సరికాదన్నారు. తన ఖాతాలోనూ రైతు బంధు డబ్బులు రూ.3లక్షలు జమయ్యాయని తెలిపారు. తనలాంటి వాళ్లకు రైతు బంధు డబ్బులు అవసరమా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ సొమ్ము పేద రైతులకే చెందాలన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఆర్టీసీ సమ్మె గురించి కూడా రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఎవరు లాభపడ్డారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమ్మెతో ప్రజలు, కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. చనిపోయిన కార్మికులను తిరిగి తీసుకురాగలరా ? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
కాగా,తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకాన్ని పరిమితి లేకపోవడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వందల ఎకరాలు ఉన్న ఆసాములకు కూడా రైతు బంధు డబ్బులు చెల్లించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాసంఘాలు,ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పలుమార్లు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ప్రభుత్వం కూడా రైతు బంధుకు కటాఫ్ విధించేందుకు సన్నద్దమైనప్పటికీ.. ఇప్పటికైతే దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.