పార్టీ నిద్రపోతోందా? ఎందుకు పికప్ కావడం లేదు?: కాంగ్రెస్ పెద్దలపై కోమటిరెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: తనకు షోకాజు నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తనకు రెండు రోజులు అవసరం లేదని.. రెండు గంటల్లోనే వివరణ ఇస్తున్నానని చెప్పారు.
అలాంటి వ్యాఖ్యలా?: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ షోకాజు నోటీసులు
నాకు నోటీసులు ఇవ్వడం కాదు..
తాను కార్యకర్తల ఆవేదనను గట్టిగా వినిపించానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కనపెట్టడంతోనే తాను ఆవేదనతో మాట్లాడేనే తప్ప పార్టీకి నష్టం చేయాలని కాదని ఆయన స్పష్టం చేశారు. తనకు నోటీసులు ఇవ్వడం కాదు.. తన సూచనలను పాజిటివ్గా తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానానికి రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు.
కేసీఆర్ను ఛాలెంజ్ చేసి గెలిచా..
కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుంచుకోవడం లేదో, పికప్ కావడం లేదో ఆలోచించుకోవాలని పార్టీ పెద్దలకు సూచించారు. తాను గతంలో కేసీఆర్ను ఛాలెంజ్ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తమ లాంటి యువకులను పార్టీ ముందుంచి నడిపించాలని అన్నారు. తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పార్టీని బలిచేస్తారా?
నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన వ్యక్తులకు పదవులు కట్టబెడతారా? అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కార్యకర్తలు మాత్రం తమలాంటి వ్యక్తులనే కోరుకుంటున్నారని అన్నారు. తమకు పదవులు అవసరం లేదని, పార్టీకి లాభం చేకూర్చే వారికి ప్రాధాన్యత ఇవ్వండని సూచించారు. సీనియర్ నేతలు సీఎం పదవి కోసం కాంగ్రెస్ పార్టీని బలిచేస్తున్నారని అన్నారు.
సురేష్ రెడ్డి పేరు ఎలా? నిద్రపోతున్నారా?
గెలిచే వారికి టికెట్లు ఇవ్వాలని కోరుతున్నానని, తమకు ప్రాధాన్యత కల్పించాలని కాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన సురేష్ రెడ్డి పేరు కమిటీల్లో ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అంటే పార్టీ నిద్రపోతోందా? అని నిలదీశారు. కనీసం జాబితా కూడా చూసుకోరా? అని మండిపడ్డారు.