మునుగోడు టిక్కెటివ్వండి, ఆవేశంలో మాట్లాడా: కోమటిరెడ్డి రాజగోపాల్, కాంగ్రెస్ ఏం చేస్తుంది?
నల్గొండ: పార్టీ కోసం కష్టపడిన వారిని అధిష్టానం పక్కకు పెడుతోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తాను ఆవేదనతోనే మాట్లాడాను తప్పు ఎవరి మీదనో కోపంతో మాట్లాడలేదని, తనకు ఎవరి మీదా కోపం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను గుర్తించి టిక్కెట్లు ఇస్తే బాగుంటుందని చెప్పారు.
ఒక్కటే టిక్కెట్, పరకాలపై మరో షరతు: కొండా సురేఖకు కాంగ్రెస్ షరతు!
మునుగోడు టిక్కెట్ ఇస్తే గెలుస్తా, ఆవేశంలో మాట్లాడా
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు తనను కోరుకుంటున్నారని కోమటిరెడ్డి చెప్పారు. తనకు టిక్కెట్ ఇస్తే తాను భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. టిక్కెట్ ఇస్తారని తాను ఆశిస్తున్నానని, క్రమశిక్షణ కమిటీకి కట్టుబడి పని చేస్తానని చెప్పారు. తాను ఆవేశంలో మాట్లాడిన దానికి చర్యలు తీసుకుంటానంటే వారి ఇష్టమని చెప్పారు.
గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ
అంతకుముందు, హైదరాబాదులోని గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణా కమిటీ సమావేశమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రెండో నోటీసు ఇచ్చి 24 గంటల సమయం గడిచినా స్పందన లేకపోవడంతో మరోసారి భేటీ అయ్యారు. అయితే రాజగోపాల్ రెడ్డి సమీప బంధువులు మరణించడంతో సకాలంలో స్పందించలేదని చైర్మన్కు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. దీంతో అతని విచారణ కోసం మరోసారి వేచి చూడాలని కమిటీ నిర్ణయించింది.
రాజగోపాల్ రెడ్డిపై త్వరలో నిర్ణయం
క్రమశిక్షణా కమిటీ అలా నిర్ణయించిన అనంతరం, రాజగోపాల్ రెడ్డి దీనిపై పైవిధంగా స్పందించారు. తాను ఆవేశంలో మాట్లాడానని, కానీ చర్యలు అంటే వారి ఇష్టమని చెబుతూనే, తనకు మునుగోడు టిక్కెట్ ఇవ్వాలని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి పైన ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
సోనియా గాంధీతో సభలు
ఇదిలా ఉండగా, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో తెలంగాణలో రెండు సభలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. దీనిపై టీపీసీసీలో చర్చించారు. గతంలో ఖమ్మం జిల్లాలో పొత్తుతో నష్టపోయామని, ఈసారి సీట్ల సర్దుబాటు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ సీనియర్ నేత పొంగులేటి అన్నారు.