టికెట్లు అమ్ముకునేవారు నోటిసులిస్తారా? బూతులకే పదవులిస్తారా?: కోమటిరెడ్డి రాజగోపాల్ నిప్పులు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలున్నాయని, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలున్నాయన అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకు కాగ్రెస్ పార్టీ నుంచి షోకాజు నోటీసులు రావడంపై శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
తనలాంటి వ్యక్తులు మాట్లాడితేనే పార్టీకి పరిస్థితి తెలుస్తుందని అన్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని పార్టీకి సూచించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజలు, కార్యకర్తల మనోభావాలు తెలుసుకోండని అన్నారు. గాంధీభవన్లో కూర్చుని ప్రెస్ మీట్లు ఇస్తే సరిపోదని సొంతపార్టీ నేతలకు చురకలంటించారు.
పదవులకు పనికిరామా?
సోనియా గాంధీనే తెలంగాణ ఇచ్చిందని, ఎంపీల పోరాటం నెంబర్ వన్ అని మేడమ్ చెప్పారని కోమటిరెడ్డి తెలిపారు. ఇతర పార్టీల వారికి కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వడం పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను అవమానించడమేనని అన్నారు. తాము పదవులకు పనికిరామా? పోరాటం చేయలేమా? అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
బూతులు మాట్లాడితేనే పదవులా?
బూతులు మాట్లాడితేనే పదవులు ఇస్తారా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. పీసీసీ పదవులపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. 70ఏళ్లు ఉండి ఎమ్మెల్సీ సీటు కావాలని, ముందు వరుసలో కూర్చుంటామంటే ఎట్లా అని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కారణంగానే గత ఎన్నికల్లో ఓడిపోయామని, ఇప్పుడు ఆ పరిస్థితి రానీయొద్దని సూచించారు.
స్వార్థ రాజకీయాల కారణంగానే..
తమకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల నాయకత్వంపై నమ్మకం ఉందని, తెలంగాణలో అధికారంలోకి వస్తామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానాన్ని కొందరు తప్పుదోవపట్టించారని అన్నారు. ఎన్నికల కోసం ఇన్ని కమిటీలు ఎందుకని ప్రశ్నించారు. కొత్తగా మేనిఫెస్టో కమిటీ ఎందుకు? ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించేశారుగా.. అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తనలాంటి వారు కోరుకుంటున్నారని కోమటిరెడ్డి చెప్పారు. కొందరి స్వార్థ రాజకీయాల కారణంగా పార్టీ నష్టపోతోందని అన్నారు. కార్యకర్తలు చాలా బాధపడుతున్నారని చెప్పారు.
టికెట్లు అమ్ముకునేవారు నాకు నోటీసులిస్తారా?
పార్టీలో ఒక గ్రూప్గా మారి వారికి అనుగుణంగా ఉన్నవారికే పదవులు ఇస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. పోస్టులు, టికెట్లు అమ్ముకునే వాళ్లు తనకు నోటీసులు ఇస్తారా? అని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పార్టీ కోసం పనిచేసే తమకు నోటీసులా? అని ప్రశ్నించారు. తాను కరుడుగట్టిన కాంగ్రెస్ వాదినని.. తనకు నోటీసులెలా ఇస్తారని నిలదీశారు. బహిరంగంగా మాట్లాడటం తప్పే కానీ, మా మాట పట్టించుకోని కారణంగాన తమ వాదన వినిపించామని కోమటిరెడ్డి చెప్పారు.