రాజగోపాల్ రెడ్డి మర్మమేంటి.. భవిష్యత్ సీఎంగా చెప్పుకోవడానికి రీజన్ ఇదేనా!.. బీజేపీ ఎంట్రీ కన్ఫామేనా?
హైదరాబాద్ : రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు సహజం, సర్వసాధారణం. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పక్కా పొలిటిషియన్గా కనిపిస్తున్నారు. బీజేపీలో చేరకుండానే సొంత గూటి పెద్దలను తికమక పెడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి అల్టర్నేట్ బీజేపీయేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్కు రాజగోపాల్ రెడ్డి రూపంలో చిక్కులు తెచ్చిపెడుతోంది.
పార్టీ మారితే మారాలి గానీ ఇంత రాద్దాంతం ఎందుకనే వాదనలు లేకపోలేదు. పది రోజుల నుంచి హైడ్రామా నడిపిస్తూ, సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూడటం అవసరమా అంటూ సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డిపై విసుర్లు మొదలయ్యాయి. అదలావుంటే పార్టీ మారడం కన్ఫామ్ అంటూ మంగళవారం నాడు రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లైంది.
రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్లు.. రాజమండ్రిలో టెన్షన్ టెన్షన్
కాంగ్రెస్లో ఉంటూ.. బీజేపీకి మద్దతుగా..!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమల తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అయింది. ఆయన వ్యాఖ్యలు వాటికి ఊతమిస్తూ మరింత ఆసక్తి రేపాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏదైనా పార్టీ ఉందంటే అది బీజేపీయేనని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ వార్ మొదలైంది.
రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడటంపై ఆయనకు షోకాజ్ నోటీసులు ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించడంతో.. మీరు నాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడమేంటి.. ప్రజలే మీకు షోకాజ్ నోటీసులు ఇస్తారంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ క్రమంలో వారం రోజులుగా కాంగ్రెస్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి తీరుగా మాటల యుద్దం నడుస్తోంది.
బీజేపీ నుంచి ఆహ్వానం.. కమల తీర్థం పుచ్చుకుంటా..!
కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అందుకే పార్టీ మారాలని డిసైడ్ అయినట్లు వెల్లడించారు. బీజేపీ నుంచి నుంచి తనకు ఆహ్వానం ఉందని, నూటికి నూరు శాతం పార్టీ మారడం ఖాయమన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి అల్టర్నేట్ బీజేపీ మాత్రమేనని పది రోజుల కిందట చెప్పానని.. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న కుంతియా వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కలేదని ఆరోపించారు. రానున్న రోజుల్లో బీజేపీ బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ను గద్దె దించుతా.. బీజేపీకే నెక్ట్స్ అధికారం..!
సీఎం కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా పార్టీ మారుతున్నట్లు చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. తన వెంబడి నడిచొచ్చే కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే భవిష్యత్ సీఎం అంటూ వ్యాఖ్యానించినట్లు చెప్పుకొచ్చారు. బీజేపీలోకి రావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తనను కోరినట్టు వెల్లడించారు. ఆ విషయంలో రాం మాధవ్ను కలిసి చర్చలు జరిపినట్టు తెలిపారు.
12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకుంటే.. టీపీసీసీ నేతలు పట్టించుకోలేదని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. తనకు షోకాజ్ ఇచ్చే నైతిక అధికారం టీపీసీసీకి లేదని ధ్వజమెత్తారు. పీసీసీ చీఫ్గా ఎవరిని నియమించినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఒక మునిగిపోయే నావ అని జోస్యం చెప్పారు. టీపీసీసీ చీఫ్గా ఇన్నాళ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించడం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో కాదు.. దూరదృష్టితో బీజేపీ వైపు
ఆర్థిక ఇబ్బందులతోనే మరే కారణాలతోనో బీజేపీ వైపు తాను చూడటం లేదని చెప్పారు. తనకు నిజంగా ఆర్థిక సమస్యలుంటే గతంలో టీఆర్ఎస్ నేతలు పార్టీలో చేరామని ఆహ్వానించినప్పుడే వెళ్లి ఉండేవాడినని వివరించారు. అలా స్వార్థంతో కాకుండా.. దూరదృష్టితో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దేశంలోని యువత బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోందన్నారు. అందుకే తాను కూడా బీజేపీ వైపు దృష్టి సారించినట్లు చెప్పారు.
బీజేపీ అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యామని చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. బీజేపీలో ఎలా చేరాలనే అంశంపై సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. రానున్న జమిలి ఎన్నికలతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.