ఓర్వలేకే దుష్ప్రచారం.. సీబీఐతోనే దోషులెవరో తేలుద్ది : కోమటిరెడ్డి
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీమ్ తో కోమటి బ్రదర్స్ కు సంబంధాలున్నాయంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నయీమ్ తో తమకెలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పిన ఆయన.. నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ.. తప్పు చేస్తే తమపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు కోమటిరెడ్డి. నయీమ్ కేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలు దోషులు బయటపడుతారన్నకోమటిరెడ్డి.. తమ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే కొంతమంది తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
భూ దందాలు, రౌడీయిజం, సెటిల్మెంట్ లాంటి సంఘ వ్యతిరేక చర్యలకు కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యతిరేకమని కుండ బద్దలు కొట్టారు. గతంలో తమను చంపుతామంటూ దుండగుల నుంచి బెదిరింపుకాల్స్ వచ్చాయని చెప్పుకొచ్చిన కోమటిరెడ్డి.. దీనిపై గత జనవరిలో ఐజీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నయీమ్ కేసును ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది కుయుక్తులు పన్నుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. నయీమ్ తో కోమటి బ్రదర్స్ కు సంబంధాలున్నాయంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన సందర్బంగా కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.