కోమటిరెడ్డి-సంపత్ల ఇష్యూ: తెలంగాణ స్పీకర్-లా సెక్రటరీకి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ పునరుద్ధరణ కేసులో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వాన్ని రద్దు చేయడం కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే.
వారి సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత కోమటిరెడ్డి, సంపత్లు స్పీకర్ను కలిశారు. కానీ ఇప్పటి వరకు వారి సభ్యత్వాలను పునరుద్ధరించలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసినా సభ్యత్వాలు పునరుద్ధరణకు నోచుకోలేదు.
హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సభ్యత్వం రద్దయిన కోమటిరెడ్డి, సంపత్లు స్పీకర్ను కలిసి కోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరారు. ఆయన పరిశీలిస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినా తమను ఎమ్మెల్యేలుగా పరిగణించకుండా కోర్టు తీర్పును ధిక్కరిస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది.