కోమటి రెడ్డి సంచలనం .. వైఎస్సార్ ఒకడుగు వేస్తే జగన్ రెండు అడుగులేస్తారు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏపీలో కాబోయే సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు . ఏపీలో జగన్ అనూహ్య విజయం సాధించటంపై స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో తాను ఎంపీగా గెలవడం, అటు ఏపీలో జగన్ సీఎం కానుండడం ఎంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు.
జగన్ గత పదేళ్లుగా చాలా కష్టపడ్డాడని ఈ విజయం జగన్ పదేళ్ళ కృషి ఫలితం అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా జగన్ తండ్రి వైఎస్సార్ ను కూడా ప్రస్తావించారు కోమటి రెడ్డి వెంకట రెడ్డి . దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకున్న ఆయన వైఎస్సార్ ఎప్పుడూ ప్రజల విషయంలోముందుండేవారని, జగన్ ఆయన్ను మించిపోతారని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ ఒక్కడుగు వేస్తే జగన్ రెండడుగులు వేస్తారని కితాబిచ్చారు. జగన్ ఈస్థాయికి చేరడం వెనుక పదేళ్ల శ్రమ ఉందని, ఎంతో కష్టించి ప్రజాదరణ పొందారని జగన్ ను కోమటి రెడ్డి ప్రశంసించారు . ఇక తాను సైతం నీతిగా పని చేసాను కాబట్టే ప్రజలు తనకు పట్టం కట్టారని ఆయన చెప్పుకొచ్చారు.