సామాన్యులపై భారం: హైకోర్టులో ఎల్ఆర్ఎస్పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిటిషన్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ పథకాన్ని కొంతమంది ఆహ్వానిస్తున్నప్పటికీ.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం పేద ప్రజలపై అధిక భారం పడుతుండటమేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్పై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎల్ఆర్ఎస్పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్ఆర్ఎస్ ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారమవుతోందని, ఎప్పుడో తీసుకున్న స్థలానికి మళ్లీ డబ్బులు కట్టలేరని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన, ఆమోదించబడని లేఅవుట్లను నిరోధించడానికి ప్రభుత్వ నియమాలు, నిబంధనలు జారీ చేసిందని.. అయితే, పేద, మధ్య తరగతి ప్రజలు వారి తప్పులేకున్నా భారీ జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
సామాన్య ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లు వారు కష్టపడి సంపాదించినవని.. ఇప్పుడు వారిపై ఇంత భారీ జరిమానా విధించడం ఏంటని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఎప్పుడో కొన్న ప్లాట్కు.. కొనుగోలు ధరలో దాదాపు సగం మళ్లీ కట్టాల్సి వస్తుందని ఆయన తెలిపారు.
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అనేక వేల ఎకరాల భూములు వెంచర్లుగా మారాయని, సుమారు 3-5 లక్షల ప్లాట్లు అమ్ముడుపోయాయని తెలిపారు. ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమని ప్రకటించబడ్డాయని, అనుమతి లేని ఈ లేఅవుట్లకు పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. అనుమతి లేని వెంచర్లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
అధికారులు చేసిన తప్పునకు సామాన్య ప్రజలపై భారీ జరిమానా విధించడం సరికాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సాధారణ ప్రజల భూములను రిజిస్ట్రేషన్ చేయడాన్ని నిషేధించే నిబంధనలు 2020 జారీ చేయడం రిజిస్ట్రేషన్ చట్టానికి విరుద్ధమని అన్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే సామాన్య ప్రజలకు ఎలాంటి జరిమానా ఛార్జీలు లేకుండా, రిజిస్ట్రేషన్లను ఆపకుండా రెగ్యులరైజేషన్ చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్.. ఎల్ఆర్ఎస్ అంశంపై పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లనన్నింటినీ హైకోర్టు ఒకేసారి విచారించే అవకాశం ఉంది.