‘కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే! మున్సిపల్ ఎన్నికల్లో సిగ్గులేకుండా..: ఈ కోమటిరెడ్డి వదలిపెట్టడు’
Recommended Video
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ పశువులకంటే హీనంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే మండిపడ్డ ఆయన.. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేశారు..
గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ప్రకటనకు ముందే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికలు నిజాయితీగా జరగలేదని అన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు. ఎక్స్ అఫీషియో ఓట్లతో యాదగిరిగుట్టను టీఆర్ఎస్ కైవసం చేసుకుందని, ఆదిభట్లలో కాంగ్రెస్కు మెజార్టీ వచ్చినా తమ కౌన్సిలర్లను తీసుకెళ్లి టీఆర్ఎస్ నుంచి ఛైర్మన్గా చేశారని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. పెద్దఅంబర్పేట, చౌటుప్పల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లను ఎత్తుకెళ్లిపోయారని, సీపీఎం వాళ్లను కొనేశారని కోమటిరెడ్డి ఆరోపించారు.
కేటీఆర్ చెప్పిందొకటి.. చేసేదొకటి..
గత 25ఏళ్లలో ఇంత దరిద్రమైన ఎన్నికలు తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. రజాకార్ల కంటే దారుణంగా పోలీసులు వ్యవహరించారని మండిపడ్డారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ రెబెల్స్ పోటీ చేస్తే వారిని సస్పెండ్ చేస్తానని మంత్రి కేటీఆర్ చెప్పారని.. ఇప్పుడేమో వారిని మళ్లీ పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. కేటీఆర్ది నోరా.. తాటిమట్టా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దుయ్యబట్టారు.
తండ్రీకొడుకులు సిగ్గులేకుండా..
గజ్వేల్లో 74ఏళ్ల నారాయణ రెడ్డిని ఛైర్మన్ చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు. నేరేడుచర్లలో 25న తయారైన ఓటర్ల జాబితాలో ఈరోజు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని చేర్చారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ సిగ్గులేకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో గ్రామ గ్రామాన తిరిగి వారి తీరును ఎండగతామన్నారు.
కేసీఆర్ ఫ్యామిలీని కోమటిరెడ్డి వదలిపెట్టడు..
తన నియోజకవర్గ పరిధిలో 9 మున్సిపాలిటీల్లో క్లియర్ మెజార్టీ వచ్చిందని.. కానీ తమకు రెండే దక్కాయని అన్నారు. నల్గొండలో టీఆర్ఎస్-బీజేపీ, ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయని కోమటిరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై ఆధారాలను ఈడీ, విజిలెన్స్కు అందిస్తానని చెప్పారు. కోమటిరెడ్డి వారిని వదలిపెట్టడని తేల్చి చెప్పారు.