సోనియాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ.. టీ పీసీసీ చీఫ్ ప్రకటన నేపథ్యంలో ప్రాధాన్యం..
టీ పీసీసీ చీఫ్ ఎంపిక హై కమాండ్కు కత్తి మీద సాములా మారింది. వర్గ విభేదాలతో అధ్యక్షుడి ప్రకటన వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇవాళ కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీతో నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ ప్రకటన నేపథ్యంలో సోనియాతో కోమటిరెడ్డి భేటీ ప్రాధాన్యం సంతరించుకంది.
టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీపీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నారు. తాను ఎంపీ అయినప్పటికీ పీసీసీ ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కి ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినట్టే తనకు ఇచ్చినా ఇబ్బంది ఉండబోదని చెబుతున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నవారికే అధ్యక్ష పదవీ ఇవ్వాలని కోమటిరెడ్డి కోరుతున్నారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు ఎంతకాలం పార్టీలో ఉంటారో తెలియదని, పార్టీ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే చూసుకుంటారని కోమటిరెడ్డి గట్టిగా చెబుతున్నారు.
తాను కమిటీ మీటింగ్ కోసమే డిల్లీ వచ్చానని కోమటిరెడ్డి చెబుతున్నా.. పీసీసీ కోసం వచ్చారనేది అర్థమవుతోంది. ఇదే విషయాన్ని ఆయన ఆఫ్ ద రికార్డుగా అంగీకరిస్తున్నారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో పని చేస్తున్నా... పదవులు ఇవ్వక పోయిన పార్టీ కోసం పని చేస్తానని చెబుతున్నారు. రాహూల్ గాంధీని కూడా కలుస్తానని చెబుతున్నారు. మిగతా వారి మాదిరే తాను పీసీసీ రేసులో ఉన్నానని.. పదవి ఆశిస్తే తప్పేముందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాదిస్తున్నారు.