నల్గొండలో పరస్పరం రాళ్ళు రువ్వుకొన్న టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు, కోమటిరెడ్డి అరెస్ట్
నల్గొండ బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది.
నల్గొండ:నల్గొండ బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి వర్గీయులు మంగళవారం నాడు ఒకరిపై మరోకరు రాళ్ళురువ్వుకొన్నారు.ఎమ్మెల్యేకు రక్షణగా పోలీసులు నిలవాల్సి వచ్చింది.
బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గో బ్యాక్ అంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడ టిఆర్ఎస్ కార్యకర్తలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వావాదం చోటుచేసుకొంది.ఒకరినోకరు తోసుకొన్నారు. బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకొంది. మంత్రి జగదీష్ రెడ్డి వర్గీయులు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వర్గీయులు రాళ్లురువ్వుకొన్నారు.ఆ సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అక్కడే ఉన్నారు.
కుర్చీలతో ఇరువర్గాలు కొట్టుకొన్నారు. బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవ ప్రాంగణానికి ఎమ్మెల్యే చేరుకొన్నారు.దీంతో టిఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాలు ఒకరిపై మరోకరు రాళ్లురువ్వుకొన్నారు.
నల్గొండ ఎస్పీ ప్రకాష్ రెడ్డి సంఘటనాస్థలానికి చేరుకొని అతికష్టం మీద పరిస్థితిని చక్కదిద్దారు.ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.ఎమ్మెల్యేకు చెందిన మూడు వాహానాలు ధ్వంసమయ్యాయి.అయితే నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆయనను మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.