జగన్ జాగ్రత్త! కేసీఆర్తో స్నేహం చేస్తున్నావ్: కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీని అక్కడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేశారని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టడం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. వయస్సులో కేసీఆర్ కంటే చిన్నవాడైనప్పటికీ కార్మికులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారు.
కేసీఆర్.. జగన్ను చూసైనా..
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని చురకలంటించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇబ్రహీంపట్నం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన కోమటిరెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు తీరుపై మండిపడ్డారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని.. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో మాత్రం ఎందుకు చేయడం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు.
జగన్.. కేసీఆర్తో స్నేహం చేస్తే..
పదేళ్ల క్రితం చనిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులు, కీర్తి వల్లే జగన్మోహన్ రెడ్డి సీఎంగా గెలుపొందారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో సీఎంగా ఉన్న కేసీఆర్ మాత్రం తన కుమార్తెను ఎంపీగా గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్ లాంటి నేతలతో స్నేహం చేసి జగన్మోహన్ రెడ్డి తనకున్న మంచి పేరును చెడగొట్టుకోవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.
జగన్ మద్దతు తెలపాలంటూ..
అంతేగాక, తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు తెలపాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ గత 11 రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, సీఎం కేసీఆర్ మాత్రం సమ్మె చేస్తున్న కార్మికులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ మాత్రం..
సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇకనుంచి వారు ఆర్టీసీ కార్మికులు కాదని అన్నారు. అయినా కూడా కార్మిక సంఘాలు తమ సమ్మెను కొనసాగిస్తున్నాయి. తాజాగా హైకోర్టు టీఎస్ఆర్టీసీ సమ్మెపై స్పందించింది. సమ్మె చేయడం సరికాదని, వెంటనే ప్రభుత్వంతో చర్చలు జరిపి, సమ్మెను విరమించాలని టీఎస్ఆర్టీసీ సంఘాలకు స్పష్టం చేసింది. అలాగే, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ తీరుతో రాష్ట్రంలోని ప్రజలు నలిగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.