న్యాయస్థానాలతో నాటకాలు దారుణం: కోమటిరెడ్డి, హైకోర్టు తీర్పుపై జానారెడ్డి స్పందన
హైదరాబాద్: హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోమవారం అన్నారు. ఎమ్మెల్యేల అర్హత పిటిషన్ విషయంలో హైకోర్టులో కోమటిరెడ్డి, సంపత్లకు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు.
తమ సభ్యత్వం పునరుద్ధరించాలని, కోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై కేసీఆర్కు నమ్మకం లేదని మండిపడ్డారు. న్యాయవ్యవస్థతో నాటకాలు దారుణం అన్నారు. ప్రజలను మోసం చేసినట్లుగా న్యాయవ్యవస్థను కూడా మోసం చేస్తున్నారన్నారు.
కోమటిరెడ్డి, సంపత్లకు ఊరట: హైకోర్టులో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ
కోమటిరెడ్డికి భద్రత కల్పించాలి: జానారెడ్డి
కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వం రద్దుపై హైకోర్టు తీర్పును హర్షణీయమని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కోర్టు తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. తీర్పును అమలు చేసి స్పీకర్ చట్టల సభల హుందాతనాన్ని కాపాడాలని హితవు పలికారు. పంచాయతీరాజ్ చట్టసవరణ కోసం అసెంబ్లీని సమావేశపర్చాలన్నారు. కాంగ్రెస్ నేతలపై ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. కోమటిరెడ్డికి భద్రత కల్పించాలని ప్రభుత్వానికి లేఖ రాశానని జానా పేర్కొన్నారు.
హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి న్యాయ వ్యవస్థలపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇప్పటికైనా స్పీకర్ న్యాయస్థానాల తీర్పును గౌరవించి కోమటిరెడ్డి, సంతప్ కుమార్ల పదవులను పునరుద్ధరించాలన్నారు.