పార్టీ మారకపోతే చంపేస్తారా? నన్ను చంపకపోయారు, మొదలు పెట్టమంటావా: కోమటిరెడ్డి భావోద్వేగం
నల్గొండ: తన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ద్వాదశ దినకర్మ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతీకార హత్యలకు దిగడం తమకూ తెలుసునని, అలా చేసుకుంటూపోతే మానవత్వానికే అర్థం లేదని వ్యాఖ్యానించారు.
చదవండి: సిగ్గుపడాలి, ప్రతిదాడి తప్పదు, కోమటిరెడ్డి పారిపోరు: బొడ్డుపల్లి హత్యపై రేవంత్, జానా
శ్రీనివాస్ను దారుణంగా హత్య చేసిన వారిపై కావాలనే చర్యలు తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్పై కోమటిరెడ్డి మండిపడ్డారు. ప్రతీకార దాడులకు దిగడం తమకు కష్టం కాదన్నారు. కానీ తమవి ఆపన్నహస్తం అందించే చేతులే కానీ హత్యలు చేసేవి కావన్నారు.
చదవండి: కాఫీ డేలో కూర్చోబెట్టి బెదిరించారు, వెనుక ఎవరున్నారు: కేసీఆర్పై ఉత్తమ్ కుమార్
కేసీఆర్! మొదలుపెట్టమంటావా
కేసీఆర్! నన్ను మొదలు పెట్టమంటావా, నల్గొండ మురికి కాలువల్లో మీ కార్యకర్తల శవాలు తేలుతాయని కోమటిరెడ్డి నిప్పులు చెరిగారు. కానీ మా గుణాలు అవి కావన్నారు. తన కొడుకు చనిపోయాక ప్రజలకు సేవ చేయాలని భావించానని చెప్పారు.
హత్యా రాజకీయాలు చేయమంటావా.. కేసీఆర్కు హెచ్చరిక
హత్యా రాజకీయాలు చేయమంటావా కేసీఆర్ అని కోమటిరెడ్డి నిలదీశారు. మొదలు పెట్టమంటావా అని అడిగారు. అలా చేయాలంటే రౌడీల సతీమణులు తనకు గుర్తుకు వస్తున్నారని, అలా తాము చేయలేకపోతున్నామన్నారు. అందుకే ఆగిపోయానని కెసీఆర్కు హెచ్చరికలు జారీ చేశారు.
నా మీద కోపం ఉంటే నన్ను చంపినా బాగుండేది
తన మీద కోపం ఉంటే కనుక తనను చంపినా బాగుండేదని కోమటిరెడ్డి అన్నారు. రాయలసీమలోను ఇలాంటి హత్యలు జరగవని చెప్పారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, నమ్మించి మోసం చేసి కిరాతకంగా చంపేశారన్నారు.
పోలీసులపై నమ్మకం పోయింది
ఈ కేసులో పోలీసుల తీరు సరిగా లేదని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. రాష్ట్ర పోలీసులపై పూర్తిగా నమ్మకం పోయిందన్నారు. కాబట్టి కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. బెదిరింపులు వస్తున్నట్లు బొడ్డుపల్లి శ్రీనివాస్ తనకు చెప్పారని, అవి చిల్లర బెదిరింపులు అనుకున్నామని, ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదన్నారు. అయినా బెదిరింపులపై ఫిర్యాదులు చేశామన్నారు.
పార్టీ మారకుంటే ప్రాణాలు తీస్తారా
వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని టీఆర్ఎస్ హత్యా రాజకీయాలకు తెరలేపిందన్నారు. పార్టీ మారకుంటే ప్రాణాలు తీస్తారా అని నిలదీశారు. నిందితులను అధికార పార్టీ కాపాడుతోందన్నారు. హత్య కేసులో కేసీఆర్కు కూడా హస్తం ఉందని, అలా లేదంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. శ్రీనివాస్ హత్య ప్లాన్తో జరిగిందన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, పార్టీ తరఫున శాంతియుతంగా ఉద్యమిస్తామన్నారు.
మానవత్వానికే అర్థం ఉండదు
కాగా, బొడ్డుపల్లి హత్య కేసులో నల్గొండ జిల్లా పోలీసుల తీరు ఆ శాఖ పరువు తీసిందని కాంగ్రెస్ నేతలు ఈ సభలో దుయ్యబట్టారు. కేసును పక్కదారి పట్టించేలా వ్యవహరించారంటూ ఎస్పీ, డీఎస్పీయే లక్ష్యంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డి, జానా రెడ్డి, రేవంత్ రెడ్డి, మధుయాష్కీ, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ సహా ఆ పార్టీ నేతలంతా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. ప్రతీకార హత్యలకు దిగడం తమకూ తెలుసని, అలా చేసుకుంటూ పోతే మానవత్వానికే అర్థం లేదన్నారు.
రాజకీయ ఒత్తిళ్ల వల్లే సీఐ పత్తా లేకుండా పోయారు
బొడ్డుపల్లి హత్య విషయంలో డీజీపీని ప్రభావితం చేసి నల్గొండ ఎస్పీతో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే సీఐ పత్తా లేకుండా పోయిన వైనం సిగ్గుచేటని, రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమైనట్లు కేంద్ర హోంశాఖకు తెలియజేస్తామన్నారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే వరకు వదిలేది లేదన్నారు. ఇందుకోసం న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు. హత్య జరిగిన అయిదు రోజులకే ఆరుగురు నిందితులకు బెయిల్ వచ్చిందని, కేసును పక్కదారి పట్టించేందుకు దర్యాప్తును సరిగా నిర్వహించలేదన్నారు.