ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి కేసీఆర్కు వేల కోట్ల ముడుపులు: కోమటిరెడ్డి సంచలనం
రీడిజైనింగ్ పేరుతో ఆంధ్రా కాంట్రక్టర్లకు పనులు అప్పగించి.. సీఎం కేసీఆర్ వేలకోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.
నల్గొండ: వరంగల్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రజా నివేదన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ శ్రేణులను సన్నాసులు, దద్దమ్మలంటూ మరోసారి నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచి కౌంటర్ ఎటాక్ లు ఎక్కువయ్యాయి.
కాంగ్రెస్ నేతలు పోటీ పడి మరీ కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టింది కేవలం తమ జేబులు నింపుకోవడానికే అన్న తరహాలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.
రీడిజైనింగ్ పేరుతో ఆంధ్రా కాంట్రక్టర్లకు పనులు అప్పగించి.. సీఎం కేసీఆర్ వేలకోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇక ఓయూలో జరిగిన శతాబ్ధి ఉత్సవాల్లో కేసీఆర్ నోరు మూగబోవడంపై కోమటిరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ వైఖరి సిగ్గు చేటని, ఆ స్థానంలో మరొకరు ఎవరున్నా.. సీఎం పదవికి రాజీనామా చేసేవారని అన్నారు.
ఇక తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వాళ్లే పార్టీ మారుతారని ఎద్దేవా చేశారు.