కేసీఆర్కు సవాల్ విసిరి అన్నంత పని చేసిన రేవంత్ రెడ్డి, కొండా తర్వాత మరొకరు ఎవరు?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తెరాస నుంచి ఇద్దరు ఎంపీలు తమ పార్టీలోకి వస్తారని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దమ్ముంటే ఆపుకోవాలని సవాల్ చేశారు. అప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలను తెరాస నేతలు కొట్టిపారేశారు.
కాంగ్రెస్లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు, కేసీఆర్! దమ్ముంటే వారిని ఆపు: రేవంత్ రెడ్డి
కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, తమ పార్టీ నుంచి ఎవరూ ఇతర పార్టీల్లోకి వెళ్లరని తెరాస నేతలు చెప్పారు. ఇలాంటి మైండ్ గేమ్ ఆపకుంటే బాగుండదని హెచ్చరించారు. స్వయంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా రేవంత్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. తాము ఎవరం పార్టీ మారడం లేదని చెప్పారు. మరో ఎంపీ సీతారాం నాయక్ కూడా రేవంత్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు.
తెరాసలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల కుదుపు: మైండ్ గేమ్ వద్దని ఎంపీల తీవ్ర హెచ్చరిక
రేవంత్ సవాల్ విసిరి నాలుగైదు రోజులు కూడా కాలేదు
కాంగ్రెస్లోకి ఇద్దరు తెరాస ఎంపీలు వస్తారని, కేసీఆర్కు దమ్ముంటే ఆపుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పి కనీసం నాలుగైదు రోజులు కూడా కాలేదు. అప్పుడే ఓ వికెట్ పడిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో మరో వికెట్ ఎవరిది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రేవంత్ మైండ్ గేమ్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారని తెరాస నేతలు కొట్టిపారేసినప్పటికీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ద్వారా ఓ బిగ్ వికెట్ తెరాస కోల్పోయింది.
రేవంత్ చక్రం తిప్పుతున్నారా?
దీంతో రెండో వ్యక్తి పైన రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఉన్న ఆ కొద్దిమంది ఎంపీలలో వెళ్లేది ఎవరు.. ఎందుకు వెళ్తున్నారనే చర్చ సాగుతోంది. ఈ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో కీలక నేత. గతంలో తెలుగుదేశం పార్టీలోను కీలక నేతగా ఉన్నారు. దీంతో రేవంత్ చక్రం తిప్పుతున్నారా అనే చర్చ సాగుతోంది.
మరో ఎంపీ ఎవరు?
ప్రస్తుతానికి కేసీఆర్కు ఛాలెంజ్ విసిరినట్లుగానే ఓ ఎంపీని రేవంత్ తీసుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. తెరాసకు రాజీనామా చేస్తున్నారంటే.. దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరడానికే అంటున్నారు. ఈ నెల 23న సోనియా గాంధీ సమక్షంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారని తెలుస్తోంది. మరో ఎంపీని ఎప్పుడు తీసుకు వెళ్తారు, ఆయన ఎవరో చూడాల్సి ఉంది.
ఎన్నికల్లో కేసీఆర్ను దెబ్బతీసేందుకా?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరో పదిహేడు రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో కేసీఆర్ను వ్యూహాత్మకంగా దెబ్బతీసే ప్రయత్నాలు రేవంత్ చేస్తున్నారా.. అంటే కావొచ్చునని అంటున్నారు. మరో ఎంపీని తీసుకు వెళ్లినా, తీసుకెళ్లకపోయినా.. కేసీఆర్, తెరాసను ఆత్మరక్షణలో పడేయడమే రేవంత్ వ్యూహం కావొచ్చునని అంటున్నారు. ఇందులో భాగంగా కొండాతో ముందే చర్చలు జరిపి, ఆ తర్వాత ప్రకటన చేసి, ఇప్పుడు కొండా రాజీనామా వల్ల తెరాసను ఆత్మరక్షణలో పడేసి ఉంటారనే చర్చ సాగుతోంది. మొత్తానికి రెండో ఎంపీ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.