అంతా నేను చూసుకుంటా! రంగంలోకి కేసీఆర్: టీఆర్ఎస్లోనే కొండా దంపతులు!
Recommended Video
వరంగల్: ఇటీవల ప్రెస్మీట్ పెట్టి పార్టీ అధిష్టానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కొండా సురేఖ దంపతులు టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇందుకు ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగడమే కారణంగా తెలుస్తోంది.
టికెట్ అడ్డుకుంది కేటీఆరే! ఆగం చేసేందుకే కోటరీ: కొండా సురేఖ, 'ఇష్టం లేకున్నా హరీశ్ రావు'
రంగంలోకి కేసీఆర్..
టీఆర్ఎస్ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కొండా సురేఖ దంపతులతోపాటు పార్టీలోని ఇతర అసంతృప్తులను కూడా దారికి తెస్తున్నారు. అంతేగాక, కొండా దంపతులతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపేందుకు కేసీఆర్ అంగీకరించినట్లు సమాచారం. కాగా, గణపతి నవరాత్రులన్నీ రోజులు కూడా కొండా దంపతులు ఇంటి గడపదాటి బయటికి రారు. ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనరు. ఈ నేపథ్యంలో వినాయక నవరాత్రులు ముగిసిన అనంతరం వాళ్లు నేరుగా కేసీఆర్ను కలిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
టీఆర్ఎస్ అధిష్టానానికి అల్టిమేటం
రాష్ట్ర వ్యాప్తంగా 105మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేసిన కేసీఆర్.. వరంగల్ తూర్పు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ అభ్యర్థిత్వాన్ని పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే. దీన్ని అవమానంగా భావించిన కొండా దంపతులు హైదరాబాద్లో ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి మంత్రి కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. తనకు టికెట్ రాకపోవడానికి కేటీఆరే కారణమని ఆరోపించారు. అంతేగాక, తన టికెట్ పెండింగ్లో పెట్టడానికి కారణాలు ఏమిటో రెండు రోజుల్లోగా చెప్పాలని, లేదంటే బహిరంగ లేఖ రాసి టీఆర్ఎస్ను వీడుతానని కొండా సురేఖ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.
కేసీఆర్ సానుకూలం.. తొందరపాటు వద్దు
అయితే, ఈ క్రమంలో పార్టీలో కీలక నేత ఒకరు ఫోన్ చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, మీ విషయంలో కేసీఆర్ సానుకూల దృక్పథంతో ఉన్నారని, అంతా మంచే జరుగుతుందని చెప్పినట్లు తెలిసింది. దీంతో సురేఖ బహిరంగ లేఖను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. గణపతి నవరాత్రుల తర్వాత కొండా దంపతులు కేసీఆర్ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
వరంగల్లో కొండా దంపతులే కీలకం
రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో కొండ దంపతులను టీఆర్ఎస్ పార్టీ వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అంతేగాక, టీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లా అత్యంత కీలకమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. చిన్నచిన్న కారణాలతో ఇక్కడే ఒకటి, రెండు సీట్లను కోల్పోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని ఇటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం.
కొండాకు కేసీఆర్ ఫోన్..
కొండా దంపతులు వరంగల్ తూర్పు, పశ్చిమ, పరకాల, భూపలపల్లి నియోజకవర్గాలను ప్రత్యక్షంగా, మరో మూడు నియోజకవర్గాలను పరోక్షంగా ప్రభావితం చేయగలరని ఇంటెలిజెన్స్ వర్గాలు టీఆర్ఎస్ అధినేతకు తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో కేసీఆర్ ఇప్పటికే కొండా మురళితో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్ను తనకు వదిలేసి, జిల్లాలో పార్టీ కోసం పనిచేయాలని కేసీఆర్ వారికి సూచించినట్లు సమాచారం.
పునరాలోచనలో కొండా దంపతులు
వరంగల్ తూర్పు నియోజకవర్గం కొండా సురేఖకేనని, మరో సీటు సాధ్యమైతే ఇస్తామని, లేదంటే ప్రత్యామ్నం ఆలోచిస్తామని కేసీఆర్.. మురళికి చెప్పినట్లు తెలిసింది. టీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని వారికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా దంపతులు కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం. వినాయక నవరాత్రుల అనంతరం పార్టీలో కొనసాగుతామనే ప్రకటనే వారి నుంచి వస్తుందని టీఆర్ఎస్ వార్గాలు భావిస్తున్నాయి.