ఒక్కటే టిక్కెట్, పరకాలపై మరో షరతు: కొండా సురేఖకు కాంగ్రెస్ షరతు!
వరంగల్: మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు బుధవారం మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒకే సీటు హామీ వచ్చిందని సమాచారం.
ఇతర పార్టీలతో కలిసి పోటీ చేయడం, టిక్కెట్ కోసం పోటీ ఎక్కువగా ఉండటం తదితర పరిణామాల నేపథ్యంలో కూతురు కోసం అడుగుతున్న రెండో టిక్కెట్కు నో చెప్పారని తెలుస్తోంది. కూటమి పోటీ నేపథ్యంలో టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి నర్సంపేట టిక్కెట్ అడుగుతున్నారు. అయితే అక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత. సిట్టింగ్ స్థానాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధం లేదు.
Recommended Video
కేసీఆర్కు అదే భయం! నాతో ఇలా.. ఎర్రబెల్లితో అలా ఎందుకు?: నిప్పులు చెరిగిన సురేఖ
రేవూరికి పరకాల టిక్కెట్
దీంతో, టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి నర్సంపేట అడుగుతుండగా, అందుకు బదులు పరకాల ఇవ్వజూపుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ లెక్కల కారణంగా కూతురుకు ఇవ్వలేమని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని తెలుస్తోంది. అయితే తెరాసలో కనీసం తనకు టిక్కెట్ ఇవ్వకుండా జరిగిన అవమానం నేపథ్యంలో కాంగ్రెస్ ఒక్క టిక్కెట్ ఇచ్చినా వెళ్లడానికే కొండా దంపతులు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
కొండా సురేఖకు టిక్కెట్, రేవూరిని గెలిపించేందుకు సహకారం
కొండా సురేఖకు వరంగల్ ఈస్ట్ స్థానాన్ని కేటాయిస్తారు. కొండా దంపతుల ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దాదాపు నాలుగు నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో పరకాలలో టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డిని కూడా గెలిపించేందుకు సహకరించాలని కాంగ్రెస్ నేతలు కొండా దంపతులను కోరినట్లుగా తెలుస్తోంది. అందుకు కొండా సురేఖ కూడా అంగీకరించారని తెలుస్తోంది.
టిక్కెట్ రాకపోవడంతో
కొండా దంపతులకు కేసీఆర్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో వారు కొద్ది రోజులుగా ఊగిసలాటలో ఉన్న విషయం తెలిసిందే. వినాయక నిమజ్జనం వరకు వేచి చూసి, ఆ తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. అన్నట్లుగానే మంగళవారం వారు పార్టీని వీడటంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంకేతాలు వచ్చాయి. మంగళవారం ప్రెస్ మీట్ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేసీఆర్పై దుమ్మెత్తిపోసిన సురేఖ
తెలంగాణలో దొరల పాలన సాగుతోందని, ఉద్యమంలో పాల్గొన్న వారికి సరైన ప్రాధాన్యం లభించలేదని, బీసీ అయినందునే తనకు సరైన ప్రాధాన్యం లేకుండా చేశారని, పార్టీ కోసం ఎంతో చేస్తే, ఇప్పుడు తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదని కొండా సురేఖ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు కేబినెట్లో చోటు కల్పించకుండా నమ్మక ద్రోహం చేశారని, ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్కు మహిళలపై ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోందని దుమ్మెత్తిపోశారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు మహాకూటమి చేతుల్లో ఓటమి ఖాయమన్నారు. కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. తాను, తన భర్త ఎమ్మెల్సీ కొండా మురళి తెరాసకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందని, దీనిపై రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని అధిష్ఠానాన్ని కోరానని, జవాబు లేదని, అందుకే కేసీఆర్కు బహిరంగ లేఖ రాస్తున్నానని, తెరాసను నమ్మే పరిస్థితి లేదని, అందువల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నామని, నాలుగేళ్ల పాటు ప్రయత్నించినా కేసీఆర్ తనకు అపాయింట్ ఇవ్వలేదని, ఉద్యమంలో పాల్గొన్న వారికి పదవులు ఇచ్చేందుకు ఆలోచిస్తున్న కేసీఆర్ తనకు మందుబిళ్లలు, మంచినీళ్లు ఇచ్చే సంతోష్రావును రాజ్యసభకు పంపారని, తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీని కలిసి కాళ్లు మొక్కిన కేసీఆర్ ఇప్పుడు ఆమెను దయ్యమంటూ అవహేళన చేయడం దారుణమని, తెరాసలో ఉన్నంత కాలం తాము హరీశ్ రావు వర్గమేనని, రాజకీయాల్లోంచి తప్పుకోవాలన్న ఆలోచన కలిగిందని హరీశ్ మాట్లాడితే బాధనిపించిందని, కోదండరాంను అప్పుడు బంగారమని, ఇప్పుడు దద్దమ్మ, సన్నాసి సర్పంచిగానైనా గెలిచాడా అని కేసీఆర్ విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఏవైనా రెండింటిలో తాము పోటీ చేస్తామని, తన పోటీ ఖాయమని, రెండో స్థానంలో తన భర్త మురళి లేదా కూతురు సుస్మితలు పోటీ చేస్తారన్నారు.