సీటు కోసం కెసిఆర్తో కొండా దంపతులు: కెకెతో డిఎస్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రసేఖర రావు మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. చాలా కాలం తర్వాత సురేఖ దంపతులు కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపింది. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును కొండా మురళికి ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి కొండా సురేఖ దంపతులు తొలుత కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత వారు టిఆర్ఎస్లో చేరారు. టిఆర్ఎస్ నుంచి సురేఖ శాసనసభ్యురాలిగా విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రి పదవిని ఆశించినట్లు చెబుతారు. ఆ పదవి దక్కకపోవడంతో చాలా కాలంగా సురేఖ చురుగ్గా వ్యవహరించడం లేదని అనుకున్నారు. తాజాగా కొండా దంపతులు కెసిఆర్ను కలుసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించకుంది.
ఇదిలావుంటే, ఇటీవలే కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్లో చేరిన డి. శ్రీనివాస్ పార్టీ సీనియర్ నేత కె. కేశవ రావుతో సమావేశమయ్యారు. వీరిద్దరు కలిసి కాంగ్రెసు పార్టీలో పనిచేశారు ఈ నేపథ్యంలో వారి భేటీకి ప్రాధాన్యం చేకూరింది. డిఎస్కు మంత్రి పదవి ఇస్తానని కెసిఆర్ ఆశ చూపినట్లు చెబుతారు. అయితే, తాను పదవులు ఆశించి టిఆర్ఎస్లో చేరలేదని డిఎస్ ఇప్పటికే చెప్పారు.
కాగా, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి ఆరోపించారు. కల్వకుర్తిలోవంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగు విడతల రుణమాఫీ రైతుల వడ్డీకే సరిపోవడం లేదని తెలిపారు. తెలంగాణలో మొత్తం 1022 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు.