ఎంపీ కోమటిరెడ్డిపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..!!
తెలంగాణ కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గాంధీ భవన్ వేదికగా పీసీసీ చీఫ్ రేవంత్ - ఎంపీ కోమటిరెడ్డి సమావేశం.. చేతులు కలపటంతో ఒక సమస్యకు పరిష్కారం దొరికిందని అందరూ భావించారు. కొత్త ఇంఛార్జ్ చొరవతో కొంత కాలంగా రేవంత్ - ఎంపీ కోమటిరెడ్డి మధ్య ఉన్న గ్యాప్ తగ్గిందని ప్రచారం నడుమ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్ కు తొలి నుంచి బలమైన మద్దతు దారుగా ఉన్న మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ సమక్షంలోనే ఎంపీ కోమటిరెడ్డి మీద కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు..డిమాండ్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త వివాదానికి కారణమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రే పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొండా సురేఖ రాష్ట్రంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అందరం కలిసి పని చేయని కారణంగానే వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయామని గుర్తు చేసారు. ఇప్పటికైనా అందరూ కలిసి పని చేస్తేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధ్యం అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హాయంలో తీసుకొచ్చిన విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అదే సమయంలో ఎంపీ కోమటిరెడ్డి గురించి సురేఖ ప్రస్తావించారు.
పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నష్టం చేసారని కొండా సురేఖ సమావేశంలో ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొండా సురేఖ డిమాండ్ చేసారు. దీంతో, వెంటనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. వ్యక్తిగతంగా ఎవరి గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవచ్చని నచ్చ చెప్పారు. పార్టీ ఇంఛార్జ్ తో వ్యక్తిగతంగా పార్టీ విషయాలను చర్చించాలని..ఇలా సమావేశంలో మరో నేత గురించి వ్యాఖ్యలు చేయటం సరి కాదని చెప్పారు. కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల్లో కొండా సురేఖ పూర్తిగా రేవంత్ కు మద్దతుగా నిలుస్తున్నారు.దీంతో, ఇప్పుడు కొండా సురేఖ చేసిన డిమాండ్ పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.