కేసీఆర్కు అదే భయం! నాతో ఇలా.. ఎర్రబెల్లితో అలా ఎందుకు?: నిప్పులు చెరిగిన సురేఖ
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ మరోసారి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని కొండా సురేఖ విమర్శించారు.
Recommended Video
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి టీఆర్ఎస్లో సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆరోపించారు. బీసీ మహిళ అయిన తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా పార్టీ కోసం ఎంతో చేశానని, అయినప్పటికీ తనకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదేనా మీరిచ్చే గౌరవం?
మంగళవారం హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కొండా సురేఖ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ విడుదల చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే ఎన్నికైన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం దారుణమన్నారు. ఒక్క మహిళా మంత్రి కూడా లేకుండా ప్రభుత్వాన్ని నడపడంలోనే మహిళలపై కేసీఆర్కు ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోందని విమర్శించారు.
అంతా నేను చూసుకుంటా! రంగంలోకి కేసీఆర్: టీఆర్ఎస్లోనే కొండా దంపతులు!
కేసీఆర్కు భయం పట్టుకుంది..
అంతేగాక, ‘టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేంద్రంతో పాటుగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామని కేసీఆర్కు భయం పట్టుకుంది. అందుకే ముందస్తు ఎన్నికలకు తెరదీశారు. టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో నా పేరు లేకపోవడం బాధించింది. దీనిపై రెండ్రోజుల్లో నాకు సమాధానం చెప్పాలని అధిష్ఠానాన్ని కోరాను. పది రోజులైనా వారి నుంచి సమాధానం రాలేదు. అందుకే కేసీఆర్ బహిరంగ లేఖ రాస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరోజు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిగా నిలిచారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఆయన కుటుంబానికి మాత్రం నాలుగు పదవులు ఇచ్చుకున్నారు' అని కొండా సురేఖ ఘాటు విమర్శలు చేశారు.
నాతో ఇలా.. ఎర్రబెల్లితో అలా..
ముఖ్యమంత్రిని కలవాలంటే సాధారణ ప్రజలకే కాదు ప్రజాప్రతినిధులకూ కష్టమైపోతోందన్నారు. సీఎం అపాయింట్మెంట్ కోసం ఎప్పుడు ప్రయత్నించినా నిరాశే ఎదురవుతోందని తెలిపారు. తన తండ్రి చనిపోతే ఓదార్చడానికి రాని కేసీఆర్... టీడీపీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్రావు తండ్రి చనిపోతే మాత్రం వరంగల్ వచ్చి పరామర్శించి వెళ్లారని చెప్పారు బీసీ మహిళను కాబట్టే తనపై వివక్ష చూపుతున్నారని కొండా సురేఖ మండిపడ్డారు.
తెలంగాణ అర్థం ఇదేనా?
‘తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి పదవులు ఇచ్చేందుకు ఆలోచిస్తున్న కేసీఆర్.. తనకు మందుబిళ్లలు సమయానికి ఇచ్చేందుకు నియమించుకున్న వ్యక్తిని మాత్రం ఏకంగా రాజ్యసభకు పంపారు. బంగారు తెలంగాణ అర్థం ఇదేనా?. రైతుబంధు పథకంతో ధనిక రైతులకు తప్ప పేద రైతులకు ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సోనియాగాంధీని కలిసి కాళ్లు మొక్కిన కేసీఆర్.. ఇప్పుడు ఆమె దెయ్యమంటూ అవహేళన చేయడం దారుణం. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. రాష్ట్రపతి హోదాలో హైదరాబాద్కు వచ్చిన ప్రణబ్ముఖర్జీకి కాళ్లు మొక్కిన కేసీఆర్... ఇప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను మాత్రం పట్టించుకోలేదు. దళితుడైనందు వల్లే ఆయన్ని కేసీఆర్ అవమానించారు' అంటూ కొండా విమర్శలు ఎక్కుపెట్టారు.