ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద ప్రమాదం: ఫిట్నెస్ లేదని డ్రైవర్ చెప్పినా! ఆసుపత్రిలో మృతి
జగిత్యాల: కొండగట్టులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడ్డ వారిని జగిత్యాల, హైదరాబాద్, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల ఆసుపత్రికి కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఎంపీ కవితలు వచ్చారు. వారు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
కొండగట్టులో ఘోర ప్రమాదం: 50మందికి పైగా చనిపోవడానికి కారణాలివే!
ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద ప్రమాదం
ఆర్టీసీ చరిత్రలోనే ఈ ప్రమాదం అతిపెద్దదిగా చెబుతున్నారు. మృతుల సంఖ్య యాభైకి పైగా పెరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 80 మందికి పైగా ఉన్నారని తెలుస్తోంది. మృతుల్లో 32 మంది మహిళలు, 15 మంది పురుషులు, 4గురు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో అధికశాతం పెద్దపల్లి, జగిత్యాలలకు చెందినవారే. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తున్నారు.
బస్సు ఫిట్నెస్ లేదని డ్రైవర్ చెప్పారు
బస్సు ప్రమాదంపై డ్రైవర్ శ్రీనివాస్ బంధువులు స్పందించారు. బస్సు ఫిట్నెస్ లేదని శ్రీనివాస్ ముందే చెప్పాడని అన్నారు. డ్యూటీకి వెళ్లేది లేదని డ్రైవర్ శ్రీనివాస్ మారాం చేశారని ఆవేదనగా చెప్పారు. అయినా విధులకు హాజరు కావాలని డిపో మేనేజర్ ఆదేశించారని మండిపడ్డారు.
ఈటెల ప్రగాఢ సానుభూతి
బస్సు ప్రమాదం చాలా బాధాకరమని ఈటెల రాజేందర్ అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు. మృతుల్లో రైతులు ఉంటే బీమా ద్వారా మరో రూ.5 లక్షలు పొందే అవకాశముందన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు.
ప్రమాదంపై మాటలు రావడం లేదు
కొండగట్టులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.