అది స్క్రాప్ కింద పడేసే బస్సు.. కారణాలెన్నో: అమ్మ కావాలని చిన్నారి, ఈటెల భావోద్వేగం
జగిత్యాల: కొండగట్టులో ప్రమాదానికి గురైన బస్సును గురువారం వెలికితీసారు. బస్సు లోయలో పడి 60 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. మరో ఏడెనిమిది మంది పరిస్థితి విషమంగానే ఉంది. ఆ బస్సును లోయలో నుంచి తీసేందుకు రెండు భారీ క్రేన్లు వినియోగించారు. ఇక్కడికి భారీగా జనాలు తరలి వచ్చారు.
చదవండి: కొండగట్టు బస్సు ప్రమాదం: బ్రేక్కు బదులు ఎక్సలేటర్ తొక్కాడు! ఎన్నో కారణాలు
ఆధారాల సేకరణ
మరోవైపు, బస్సు ప్రమాదంపై విచారణ జరుగుతోంది. క్లూస్ టీం అధికారులు వివరాలు సేకరించారు. జిల్లా రవాణా అధికారి ఆధ్వర్యంలో కొండగట్టులో ఓ హోటల్లో ప్రత్యేకంగా సమావేశమై, ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించారు. బస్సును లోయలో నుంచి తీసిన నేపథ్యంలో దానిని పరిశీలించి, మరిన్ని వివరాలు, ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఓ లాయర్ హెచ్చార్సీకి వెళ్లారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని, కారకులపై హత్యాయత్నం కేసు పెట్టాలన్నారు.
చిన్నారిని చూసి ఈటెల భావోద్వేగం
ప్రమాదంలో ఓ తల్లిని కోల్పోయిన చిన్నారిని చూసి ఆపద్ధర్మ మంత్రి ఈటెల రాజేందర్ భావోద్వేగానికి గురయ్యారు. బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిని ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని చెప్పారు. వారి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. నగునూర్ ఆసుపత్రిలో ఓ చిన్నారి... తల్లిని కోల్పోయింది. ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అమ్మ కావాలి అంటూ ఏడుస్తుండటం చూసి ఈటెల భావోద్వేగానికి లోనయ్యారు. తక్కువ మొత్తంలో ఆర్థిక సాయం అందుతున్న వారికి పార్టీ ద్వారా అందిస్తామన్నారు.
జీవితకాలంను మించి తిరిగిన బస్సు
మరోవైపు, బస్సును వెలికి తీసిన నేపథ్యంలో అధికారులు విచారణను వేగవంతం చేశారు. ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు. ఆర్టీసీ బస్సు కండిషన్లో లేకపోవడం, బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. 2007 మోడల్ చెందిన ఆర్టీసీ బస్సు జీవితకాలంలో 12 లక్షల కి.మీ. కానీ ఈ బస్సు మాత్రం 14 లక్షల 95 వేల 116 కిలో మీటర్లు తిరిగింది.
ప్రమాదానికి పలు కారణాలు
12 లక్షల కి.మీ. తిరిగిన తర్వాత బస్సును స్క్రాప్ కింద భావించి పక్కకు పడేయాలి. కానీ, స్క్రాప్గా భావించే బస్సును ఈ రూటులో నడపడంతో ఘోరం జరిగిందని నిర్ధారించారని తెలుస్తోంది. రెగ్యులర్ బస్సు, రెగ్యులర్ డ్రైవర్ అయినప్పటికీ కాలం చెల్లిన వాహనం కావడం.. ఘాట్రోడ్డులో సరిగ్గా బ్రేక్ వేయడానికి వీలుపడకపోవడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మరిన్ని ఆధారాలు సేకరించి, పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. బస్సు ఫిట్నెస్ సరిగా లేకపోవడం, బ్రేక్ రాకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఉండడం ఈ మహా విషాదానికి కారణమని కూడా ప్రాథమికంగా తేల్చారు.