కొండగట్టు బస్సు ప్రమాదం: బ్రేక్కు బదులు ఎక్సలేటర్ తొక్కాడు! ఎన్నో కారణాలు
కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో 60 మంది వరకు మృతి చెందారు. కొందరు బస్సు ఎక్కిన క్షణాల్లోనే పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బయటపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ఆ ప్రమాదాన్ని తలుచుకొని భయకంపితులవుతున్నారు.
చదవండి: గుండెలు పిండేసే విషాదం, మాటలు రావట్లేదు: బస్సు ప్రమాదంపై మోడీ, కోవింద్, పవన్ కళ్యాణ్
డ్రైవర్ నిర్లక్ష్యం, ఘాట్ రోడ్డు నిర్మాణంలో లోపాలే కారణమని ఆర్టీసీ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. బస్సు అదుపు తప్పినప్పుడు ఎమర్జెన్సీలో ఉపయోగించే హ్యాండ్ బ్రేక్ను డ్రైవర్ ఉపయోగించలేదని గుర్తించారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నారు. విచారణ అధికారిగా నల్గొండ ఆర్టీసీ ప్రాంత మేనేజర్ను నియమించారు. అధికారులు బుధవారం ఆ రోడ్డను పరిశీలించారు. ఘాట్ రోడ్డు నిర్మాణం లోపభూయిష్టంగా ఉన్నట్లు గుర్తించారు.
చదవండి: ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద ప్రమాదం: ఫిట్నెస్ లేదని డ్రైవర్ చెప్పినా! ఆసుపత్రిలో మృతి
బస్సు డ్రైవర్ గతంలోను ప్రమాదాలు చేశారా?
బస్సు డ్రైవర్ శ్రీనివాస్ గతంలోను ప్రమాదాలకు గురి చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. మెట్పల్లి డిపోలో ఉన్నప్పుడు మార్చి 28, 2009లో జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారని చెబుతున్నారు. అంతకుముందు మంథని డిపోలో ఉన్నప్పుడు జూన్ 29, 2007లో, దానికి ముందు నవంబర్ 12, 2006లోను ప్రమాదాలు జరిగాయని అంటున్నారు. మే 24, 2013లోను ఆ డ్రైవర్ మరో ప్రమాదానికి కారణమయ్యాడని, దీనికి గాను ఆ తర్వాత జూన్ 6, 2013 నుంచి రెండేళ్ల పాటు సస్పెండ్ అయ్యారని చెబుతున్నారు. 2009లో జరిగిన ప్రమాదానికి ఇంక్రిమెంట్ తగ్గించారని అంటున్నారు.
పిట్ట గోడ లేదు
బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఘాట్ రోడ్డులో భక్తుల కోసం కాలిబాట లేదు. వాహనాల రాకపోకలకు వీలుగా మార్గాన్ని కొంత మేరకు విస్తరించినప్పటికీ కందకాలు ఉన్న ప్రాంతంలో పిట్టగోడ నిర్మించాలి. కాని అది లేదు. కేవలం సన్నటి రెయిలింగు ఉంది. పాదచారుల మార్గం ఉన్నా, పిట్టగోడ ఉన్నా ప్రమాద తీవ్రత తగ్గేదని చెబుతున్నారు. కొండ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లను నిర్మించవద్దని, నిర్మించాల్సివస్తే మూడు అంగుళాల ఎత్తులో మాత్రమే నిర్మించాలన్న నిబంధనను పట్టించుకోలేదని తేలిందని తెలుస్తోంది. అక్కడ మట్టి తవ్వకాలను కూడా పట్టించుకున్న దాఖలాలు లేవంటున్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం ఇలా
డ్రైవర్ నిర్లక్ష్యం ఉందని అంటున్నారు. ప్రమాదానికి కాస్త ముందుగానే డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయి ఉంటారని భావిన్నారు. స్లోప్ ఉండటం, వెంట వెంటనే మూడు స్పీడు బ్రేకర్లు ఉండటంతో బస్సు నియంత్రణ తప్పిందని, స్పీడు బ్రేకర్ల వద్ద ఒక్కసారిగా పైకి లేచిందని, నియంత్రించే కంగారులో కుడివైపు బదులు ఎడమ వైపుకు తిప్పటంతో బస్సు లోయలోకి పడిపోయి ఉంటుందని అంటున్నారు. ఇంజిన్ ఆప్ చేసి నడపడం కూడా ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. హ్యాండ్ బ్రేక్ వాడలేదనని గుర్తించారు.
బ్రేక్ బదులు ఎక్సలేటర్ తొక్కాడు
మరో షాకింగ్ విషయం ఏమంటే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపటం వల్ల మినీ వ్యానును ఢీకొట్టిందని, దీంతో ఒత్తిడికి గురై స్పీడ్ బ్రేకర్లు రావడంతో బ్రేక్ వేయాల్సింది పోయి... ఎక్సలేటర్ తొక్కాడని, దీంతో బస్సు వేగం అదుపుతప్పి లోయలో పడిందని ఆర్టీసీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారని సమాచారం.