కొండపోచమ్మ సాగర్ కాలువకు బీటలు..గండి: వెల్లువలా ఉరికిన గోదారి..ఊరిని, పొలాలను ముంచెత్తి
సిద్ధిపేట్: తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పడింది. కిందటి నెల 26వ తేదీన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా వైభవంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కాలువ నీటి ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. బీటలు వారింది.. గండి పడింది. గేట్లు ఎత్తేసిన తరహాలో గోదావరి జలాలు వెల్లువెత్తాయి. పక్కనే ఉన్న వెంకటాపురం గ్రామాన్ని ముంచెత్తాయి. మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భయభ్రాంతులకు గురయ్యారు.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం: టీడీపీ నిర్వాకమేనంటోన్న అధికార పార్టీ
అధికారులతో మాట్లాడిన మంత్రి..
కొండపోచమ్మ సాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాను అనుసంధానించే కుడి కాలువకు గండి పడినట్లు సిద్ధిపేట్ జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఫలితంగా మర్కూర్ మండలంలోని వెంకటాపురం గ్రామంలో నీరు ప్రవేశించిందని పేర్కొన్నారు. కాలువకు గండి పడటానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని స్పష్టం చేశారు. కుడికాలువకు నీటి విడుదలను నిలిపివేసినట్లు చెప్పారు. సమాచారం అందిన వెంటనే జిల్లాకు చెందిన ఆర్థికశాఖ మంత్రి టీ హరీష్ రావు స్పందించారు. నీటిపారుదల శాఖ అధికారులతో ఫోనులో మాట్లాడారు. దీనిపై ఓ నివేదికను రూపొంచాలని ఆదేశించారు.
నదిని తలపించిన గ్రామం..
కొండపోచమ్మ సాగర్కు గండిపడటం ఇది తొలిసారి కాదు. ఇదివరకు రెండుసార్లు గండి పడింది. అప్పట్లో ఈ స్థాయిలో గోదావరి జలాలు వెల్లువెత్తిన సందర్భాలు లేవు. ఈ సారి మాత్రం వాటికి భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గోదావరి జలాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. వెంకటాపురం గ్రామాన్ని ముంచెత్తాయి. గ్రామం మొత్తం జలమయమైంది. నదిని తలపించిందా గ్రామం. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి నీళ్లు ప్రవేశించింది. గ్రామం వీధుల్లో నడుం లోతులో ప్రవాహం కొనసాగిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పంటలు, కూరగయాల తోటలను ముంచెత్తాయి.
నెలరోజుల్లోనే భారీగా గండి..
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన నెలరోజుల వ్యవధిలోనే కాలువకు గండి పడటం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ అసెంబ్లీ పరిధిలో నిర్మించిన ఈ ప్రాజెక్టుకే నాణ్యత లేదంటే.. మిగిలిన వాటి పరిస్థితేమిటని ప్రశ్నిస్తున్నారు. నీటి ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుంటోందంటూ ఆరోపణలను గుప్పిస్తున్నారు. నీటి ప్రాజెక్టుల్లో అవినీతి చోటు చేసుకుంటోందని, నాణ్యత లేకుండా ప్రాజెక్టులు నిర్మితమౌతున్నాయంటూ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
15 టీఎంసీల సామర్థ్యంతో..
కొండపోచమ్మ సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 15 టీఎంసీలు. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో దీన్నినిర్మించారు. .గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. దీని నిర్మాణ వ్యయం 16 వేల కోట్ల రూపాయలు. సుమారు లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో దీన్ని నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ.. పనుల్లో నాణ్యత లేకపోవడం వల్ల గండి పడిందనేది ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల వాదన. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఇప్పటికైనా తాము లేవనెత్తిన అనుమానాలు, ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.