ఈ ప్రభుత్వం కళ్లు తెరిచేలా: 'ఉత్తరాంధ్ర' సభలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల
శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సదస్సులో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అపార ప్రకృతి వనరులు ఉన్నాయని చెప్పారు.
అపార ప్రకృతి వనరులున్న ఉత్తరాంధ్ర జిల్లాలు పాలకుల నిర్లక్ష్యం వల్లే వెనుకబాటుకు గురయ్యాయన్నారు. వెనుకబాటుతనం, వలసల నివారణ, స్వయం అభివృద్ధి సాధనకు ఉత్తరాంధ్రలోని అన్ని ప్రజా సంఘాలు సమిష్టిగా ఉద్యమించాలని చెప్పారు.
ఉద్యమం ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని శాంతియుత పంథాలో ఉద్యమం చేసి ఈ ప్రభుత్వం కళ్లు తెరిచేలా పోరాటం చేయాలన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక ఉభయరాష్ట్రాల ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధన సమితి కన్వీనర్ జ్ఞానానందం, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆటోను ఢీకొట్టిన టీడీపీ ఎమ్మెల్యే కారు
ఖమ్మంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కారు ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన సండ్ర వెంకటవీరయ్య తిరిగి వెళ్తుండగా టీడీపీ ఆఫీస్ ముందు ఆయన కారు ఆటోను ఢీకొట్టింది.
బ్రాహ్మణుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి : కవిత
బాచుపల్లిలో కొలన్ హనుమంత్ రెడ్డి గార్డెన్లో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద గౌడ్, టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంత రావులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. బ్రాహ్మణుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. భారతీయ సంప్రదాయాలను కాపాడిన ఘనత బ్రాహ్మణులదేనన్నారు. బ్రాహ్మహ్మణ విద్యార్థుల విదేశి చదువుల కోసం ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇస్తుందని చెప్పారు.