ఉపఎన్నిక: హుజూర్నగర్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కోట రామారావు
హైదరాబాద్: హుజూర్నగర్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించగా.. తాజాగా బీజేపీ కూడా ఖరారు చేసింది. హుజూర్నగర్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కోట రామారావును బీజేపీ ప్రకటించింది.
ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, రామారావుతో పాటు ఎన్ఆర్ఐ జైపాల్ రెడ్డి పేర్లతో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధిష్టానానికి పంపింది.
అంతా అనుకున్నట్లుగానే రామారావునే బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ప్రభుత్వ వైద్యుడిగా ఉన్న సేవలందించిన రామారావు.. మూడు నెలల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సామాజిక కోణంలో రామారావును బరిలోకి దించితే కలిసి వస్తుందని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా గరిడేపల్లి మండలం కేతవారిగూడెంకు చెందిన కోట రామారావు మాట్లాడుతూ.. ప్రస్తుతం యువత బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. గత పాలకుల్లాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని మర్చిపోయిందని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. అధికార పక్షంపై ఉన్న అసంతృప్తే తనను గెలిపిస్తుందిన ఆయన వ్యాఖ్యానించారు.
సీపీఎం అభ్యర్థిగా ఆరెపల్లి శేఖర్ రావు
హుజూర్నగర్ సీపీఎం అభ్యర్థిగా ఆరెపల్లి శేఖర్ రావును ఆ పార్టీ ప్రకటించింది. ఎన్నికల్లో మద్దతు కోసం సీపీఐ, టీజేఎస్లతో సంప్రదింపులు జరుగుతున్నాయని సీపీఎం ప్రకటించింది. అయితే, సీపీఐ మాత్రం టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరపున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థిని గెలుపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా.. 24న ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని పార్టీలు కూడా ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.