కొత్తకోట సంచలన వ్యాఖ్య: గవర్నర్పై విహెచ్ వివాదాస్పదం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత కొత్తకోట దయాకర్రెడ్డి శనివారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా కోటాలో వచ్చే రాజ్యసభ పదవి కోసం ఎవరైనా ఆశపడితే తెలివి తక్కువ తనమే అవుతుందని ఆయన అన్నారు. ఎన్టీఆర్కు ఏ పదవి ఉందని పార్టీ పెట్టిన 9 నెలలు ప్రజల్లో తిరిగారని ఆయన ప్రశ్నించారు.
పదవుల కోసం పాకులాడటం సరికాదని, పదవి ఇస్తేనే పనిచేస్తాం అనే వైఖరి సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పదవులే కావాలనుకుంటే పార్టీకి పూర్వవైభవం తేవడం కష్టమని అన్నారు. పదవులు ఆశిస్తున్న వారు జనంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో సెంటిమెంట్, కోవర్టులతో దెబ్బతిన్నామన్నారు. పార్టీని తిరిగి నిర్మించడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని కొత్తకోట అన్నారు.
ఇదిలావుంటే, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పనితీరుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ నరసింహన్ దేవాలయాల చుట్టూ తిరగడం వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతోందని, ఉగాది ముందు రోజే గవర్నర్ పంచాంగ శ్రవణం చెప్పించడం విడ్డూరంగా ఉందని వీహెచ్ అన్నారు.
గవర్నర్ పంచాంగం చెప్పడానికి వచ్చారా అని ప్రశ్నించారు. నరసింహన్ వచ్చిన తర్వాత పంతుళ్ల పెత్తనం ఎక్కువైందని ఆయన అన్నారు. మాట్లాడితే గవర్నర్ తిరుమలకు వెళ్తున్నారన్నారు. తిరుమల వెళ్లినప్పుడు రాష్ట్రపతి కూడా పద్ధతిగా ఉంటారంటూ గవర్నర్ మాత్రం చొక్కా విప్పి తిరుగుతారని వ్యాఖ్యానించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పంచాంగ శ్రవణం పొలిటికల్ పంచాంగంగా మారిందని వీహెచ్ అన్నారు. ఏ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి అనుకూలంగా పంచాంగం చెబుతున్నారని, ఇలా అయితే పంచాంగ శ్రవణానికి విలువ ఉండదని ఆయన అన్నారు.