బర్రెలు, గొర్రెల్ని కొన్నట్లు: కొత్తకోట ఆగ్రహం, కాల్ మనీపై షబ్బీర్ అలీ
హైదరాబాద్: బర్రెలను, గొర్రెలను కొనుగోలు చేసినట్లుగా అభ్యర్థులను కొన్నారని తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కొత్తకోట దయాకర్ రెడ్డి ఆదివారం ఆరోపించారు. లగ్జరీ జీవితానికి, ఫైవ్ స్టార్ హోటళ్లకు అలవాటుపడిన నేతలు గ్రామ ప్రజలకు ఎలాంటి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఇటువంటి అభ్యర్థులను ప్రజలు నిలదీయాలన్నారు. అసమర్థులైన అభ్యర్థులతో పోటీపడినందుకు తాను చాలా సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు. తెలంగాణాలో ఆదివారం స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ప్రధానంగా నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పాలకపక్షం, ఇతర రాజకీయ పార్టీలకు మధ్య పోరు రసవత్తరంగా ఉంది.
మజ్లిస్ అండతోనే కాల్ మనీ: షబ్బీర్ అలీ
తెరాస ప్రభుత్వం శిలాఫలకాలకే పరిమితమైందని, హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ వేరుగా అన్నారు. బంజారాహిల్స్లో బంజారా భవన్ శిలాఫలకం ఎదుట మొక్కలు నాటి కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడారు. బంజారా భవన్ పేరిట కెసిఆర్ చెవిలో పూవులు పెట్టారని అభిప్రాయపడ్డారు. గిరిజనులను కెసిఆర్ నమ్మించి ముంచారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది తామేనని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ను ధిక్కరించడం విడ్డూరమన్నారు.
హైదరాబాదులో మజ్లిస్ పార్టీ అండతోనే కాల్ మనీ నడుస్తోందని ఆరోపించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. తమ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని షబ్బీర్ అలీ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.