బ్లడ్ మాఫియా: కల్తీ రక్తం అమ్మిన నరేందర్ అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తూ కల్తీ రక్తాన్ని రోగులకు అమ్మి వారి ప్రాణాలతో చెలగాటమాడిన నరేందర్ను పోలీసులు చిత్తూరులో అరెస్ట్ చేశారు. కల్తీ రక్తం అమ్ముతున్న విషయం బహిర్గతం కావడంతో నరేందర్ వారం రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
కాగా, అతని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. చిత్తూరులో శుక్రవారం అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా మరో నలుగురు మిత్రులతో కలిసి నరేందర్ ఈ కల్తీ రక్తం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
బ్లడ్ మాఫియా వివరాల్లోకి వెళితే.. నరేంద్ర ప్రసాద్ ఏడాది కాలంగా గుట్టు చప్పుడు కాకుండా కల్తీ రక్తాన్ని విక్రయిస్తూ గర్భిణీలు, బాలింతల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆసుపత్రి అడ్డాగా కల్తీ రక్తం దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నాడు ఈ ఔట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్. నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే ఈ ఆసుపత్రిలో.. కల్తీ రక్తం దందాను ఆసుపత్రి వైద్యాధికారులు కూడా గుర్తించకపోవడం గమనార్హం.
సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ నరేంద్ర ప్రసాద్, దాదాపుగా ఏడాది కాలం నుంచి రక్తంలో గ్లూకోజ్ వాటర్ కలిపి, ఆ బ్లెడ్ ప్యాకెట్లకు నగరంలో పేరు మోసిన బ్లడ్ బ్యాంక్ల నకిలీ స్టిక్కర్లు అతికించి విక్రయిస్తున్నాడు. ఇదేమి తెలియని రోగులు వాళ్ల అవసరాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.2000లకు కల్తీ రక్తాన్ని కొనుక్కుని అనారోగ్యం బారిన పడుతున్నారు.
ఇదే క్రమంలో ఇటీవల ఓ రోజు జ్వరం కారణంగా నరేంద్ర ప్రసాద్ ఆసుపత్రికి రాకపోవడంతో, అతని స్థానంలో విధులకు హాజరైన ఇతర ఉద్యోగులు రక్తం కల్తీ కావడాన్ని గుర్తించారు. బుధవారం ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ లో నిలువ ఉంచిన ప్యాకెట్లలో తేడాను గుర్తించిన సిబ్బంధి, వెంటనే బ్లడ్ బ్యాంక్ అసోసియేషన్ ప్రతినిధులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న అసోసియేషన్ ప్రతినిధులు హుటాహుటిన సరూర్ నగర్లో ని నరేంద్ర ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో భాగంగా వివిధ ప్రముఖ బ్లడ్ బ్యాంకులకు సంబంధించిన నకిలీ స్టిక్కర్లు, రక్తం నిల్వ ఉంచే ఖాళీ ప్యాకెట్లు లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో దొరికిన నకిలీ స్టిక్కర్లపై ఉన్న తేదీల ఆధారంగా సంబంధిత బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులని సంప్రదించిన అసోసియేషన్ ప్రతినిధులు, విషయం గురించి ఆరా తీశారు.
కాగా.. బ్లడ్ ప్యాకెట్లు తాము సరఫరా చేయలేదని ఆయా బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు తేల్చేయడంతో కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు పోలీసులు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ ఎస్సై నరేశ్కుమార్ నేతృత్వంలో ఈ దందా భాగొతంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ను చిత్తూరులో అరెస్ట్ చేశారు పోలీసులు.